వైఎస్ షర్మిల పార్టీ కీలక నేతకు బెదిరింపు ఫోన్కాల్: రేవంత్ సైన్యం పేరుతో: డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సమాయాత్తమౌతోన్న వైఎస్ షర్మిలకు.. పార్టీ పెట్టకముందే బెదిరింపులు అందుతున్నాయి. మొదటి నుంచీ షర్మిల వెంటే ఉంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకుడు కొండా రాఘవ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. రేవంత్ సైన్యం పేరుతో ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ అందినట్లు తెలుస్తోంది. దీనిపై తెలంగాణ డీజీపీకి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఫోన్ చేయడంతో పాటు- వాట్సప్ ద్వారా బెదిరింపు సందేశాన్ని పంపించారని సమాచారం. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డ్, వాట్సప్ చాట్ను ఆయన డీజీపీకి అందజేస్తారని సమాచారం.
Recommended Video
వైఎస్ షర్మిల ఇటీవల తన లోటస్పాండ్ నివాసంలో విద్యార్థులతో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న సునంద్ జోసెఫ్ అనే యువకుడు విద్యార్థి కాదని.. చర్చిలో డ్రమ్మర్గా, ఎవాంజిలిస్ట్గా పనిచేస్తోన్నాడంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్గా కొండా రాఘవ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అంతర్గతంగా నిర్వహించుకునే ఆత్మీయ సమావేశాలపై ఆరోపణలు చేసే హక్కు రేవంత్కు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర ఎలాంటిందో అందరికీ తెలిసిందేనని చురకలు అంటించారు.
కొండా రాఘవరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం.. ఆయనకు బెదిరింపు ఫోన్కాల్స్ రావడం మొదలు పెట్టాయి. రేవంత్ సైన్యం పేరుతో బెదిరింపులు, వాట్సప్ మెసేజీలు అందుతున్నాయని రాఘవరెడ్డి వెల్లడించారు. 14 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన కొట్లాడుతున్నారని, ప్రశ్నించే గొంతు కావడం వల్లే ఆయనను ప్రజలు ఏకంగా లోక్సభకు ఎన్నుకున్నారని, అలాంటి తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు, విమర్శలు చేేయడం సరికాదని వాట్సప్ మెసేజీని పంపించినట్లు చెప్పారు.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించాని అన్నారు. రేవంత్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీనిపై తాను తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎవరి బెదిరింపులకూ తాను గానీ, తమ పార్టీ నాయకులు గానీ భయపడే ప్రసక్తే లేదని కొండా రాఘవరెడ్డి అన్నారు. బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన విమర్శించారు.