ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇంకా పూర్తిస్థాయిలో అడుగు పెట్టకముందే వైఎస్ షర్మిల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఆమె నెలకొల్పబోయే పార్టీకి ప్రాథమిక దశలోనే క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్థులు ఏర్పడ్డారనడానికి ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. షర్మిల తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో ఈ ఘటన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
పార్టీ పేరును ప్రకటించదలిచిన జిల్లాలోనే..
ఏ జిల్లాలోనైతే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తొలి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారో, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారో.. అదే జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల ఇంకా తాను పెట్టబోయే పార్టీ పేరును ఆమె ప్రకటించలేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు.. జెండా, అజెండా ఏమిటో తెలియదు..ఈ దశలోనే ప్రత్యర్థులు ఏర్పడినట్లు పార్టీ నాయకులు భావిస్తోన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తోన్నారు.
కఠిన చర్యలు తీసుకోండి..
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పాలనను అందించి, పదవిలో ఉండగానే కన్నుమూసిన ఓ మహా నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా వైఎస్సార్ అభిమానులు అభివర్ణించారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నా వెంటనే అరెస్టెు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్నారు. ఉద్దేశపూరకంగా కొన్ని దుష్టశక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చెబుతున్నారు. వైఎస్సార్ విగ్రహాల జోలికి ఎవరు వెళ్లినా..ఉపేక్షించబోమని, తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా ఎదుర్కోవాలని సవాల్ విసురుతున్నారు.
9న బహిరంగ సభ నిర్వహించి తీరుతాం..
షర్మిల రాజకీయ అరంగేట్రం చేయబోతోన్నారని తెలిసిన తరువాత.. ఇతర పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. వచ్చేనెల 9వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తరుతామని స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయనే కారణంతో.. తమ సభను అడ్డుకోవడానికే వైఎస్సార్ విగ్రహాలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తోన్నారని షర్మిల పార్టీ నేతలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు.
పిరికిపంద చర్యగా
ఈ ఘటన పట్ల వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని, ప్రజల్లో పెరుగుతోన్న బలాన్ని, నమ్మకాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోన్నారని, వైఎస్సార్ అభిమానులంతా సంయమనం పాటించాలని ఆమె విజ్ఙప్తి చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్సార్ జ్ఙాపకాలు, ఆయన అందించిన సంక్షేమ పాలనను తొలగించలేరని అన్నారు.