ఈనాడు, ఆంధ్రజ్యోతిలను బహిష్కరించాలని వైఎస్ చెప్పారు: కెకె
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలను బహిష్కరించాలని అప్పట్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, కానీ తాను వద్దని చెప్పానని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు తెలిపారు. హైదరాబాదులోని సోమాజీగూడ ప్రెస్క్లబ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ నాయకులు అన్ని పత్రికలు చదవాలని చెప్పానని, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ వాదినైనా తన పత్రికను కూడా బ్లాక్ లిస్టులో పెట్టారని, మీడియా వల్ల తనకే ఎక్కువ ఇబ్బందులు వచ్చాయని కేశవ రావు చెప్పారు. వైయస్ హయాంలో కేశవరావు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.
కెసిఆర్ను రాళ్లతో కొట్టాలి
మాట తప్పడం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వెన్నతో పెట్టిన విద్య అని బిజెపి నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. మాట తప్పిన కేసీఆర్ను వందసార్లు రాళ్లతో కొట్టాలని ఆయన అన్నారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, సహారా ఉద్యోగులను కూడా దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నాగం డిమాండ్ చేశారు. పైపుల కంపెనీలో కేసీఆర్ కుటుంబానికి భాగస్వామ్యం ఉందని నాగం ఆరోపించారు.
కెసిఆర్ వ్యాఖ్యల్లో అభద్రతా భావం
మంగళవారం సాయంత్రం కేసీఆర్ చేసిన ప్రసంగంలో అభద్రతాభావం కనిపించిందని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళతానన్న కడియం శ్రీహరి ఇప్పటివరకు ఆ పని చేయలేదని ఆయన బుధవారం వరంగల్లో అన్నారు. మాదిగలకు కడియం శ్రీహరి క్షమాపణ చెప్పాలని కోరారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని మందకృష్ణ డిమాండు చేశారు.