చింతిస్తున్నా: 'వైసిపి'ని జగన్కు ఇచ్చిన శివకుమార్, 'సెక్షన్ 8పై పునరాలోచన'
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాకు ప్రకటన ఇవ్వడం పైన తాను చింతిస్తున్నట్లు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
భావోద్వేగాలతో చేసిన ఈ చర్యను పునరావృతం చేయనని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పానని తెలిపారు. వివరాలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు.
పదిహేను రోజుల క్రితం శివకుమార్కు వైసిపి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శివకుమార్కు షోకాజ్ నోటీసులు పంపించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. దీంతో అసంతృప్తికి గురైన శివకుమార్.. పోటీ చేయక పోవడాన్ని పత్రికాముఖంగా నిలదీశారు. దీంతో షోకాజ్ ఇవ్వగా, ఆయన చింతిస్తున్నట్లు తాజాగా పేర్కొన్నారు.
సెక్షన్ 8పై పునరాలోచన: షబ్బీర్ అలీ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు చేసిన దౌర్జన్యాలు చూస్తే విభజన చట్టంలోని సెక్షన్ 8 పైన పునరాలోచించే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ గురువారం అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, ఎంబిటి పార్టీల నాయకులతో పాటు ఓ ఉర్దూ పత్రిక విలేకరి, ఫొటోగ్రాఫర్పై దాడులు జరిగాయన్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడి పైనా దాడి యత్నం జరిగిందన్నారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కొత్త నగరంలో టిఆర్ఎస్, పాత నగరంలో మజ్లిస్ పార్టీలు దౌర్జన్యకాండకు దిగాయన్నారు. దాడులు జరిగినా జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించడంవల్లే పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం చేతుల్లో ఉండాలనే విషయాన్ని తాము వ్యతిరేకించామని, ప్రస్తుతం పునరాలోచించే పరిస్థితి వచ్చిందన్నారు.