35రోజుల తర్వాత వచ్చి, బాబు ఫోన్ చేయలేదా: జనసేన చీఫ్కు వైసీపీ
విజయవాడ: ఓటుకు నోటు కేసులో 35 రోజుల తర్వాత స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మంగళవారం విమర్శించారు.
35 రోజుల తర్వాత బయటకు వచ్చి ఓటుకు నోటు పైన మాట్లాడలేదన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారన్నారు. దీనికి నిర్మాత, సంగీతం, దర్శకుడు, మాటలు ఎవరో ఇట్టే అర్థమవుతోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు స్టీఫెన్ సన్కు ఫోన్ చేయడం నేరం కాదా అని ప్రశ్నించారు. స్టీఫెన్ సన్ ఫోన్ రికార్డు చేయడం నేరం ఎలా అవుతుందన్నారు. గంటసేపు ప్రెస్ మీట్ పెట్టి ఓటుకు నోటుపై మాట్లాడలేదన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ మాట దివాళాకోరు వాదన అన్నారు.
కాగా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబు, కెసిఆర్లకు హితవు పలికినప్పటికీ.. హరీష్ రావు, టీడీపీ ఎంపీలు, కేంద్రమంత్రుల పైన ఎక్కువగా, నేరుగా మండిపడ్డారు. ఓటుకు నోటు కోర్టు వ్యవహారంలో ఉన్నందున మాట్లాడలేదు.