ఇష్టంనట్లు మాట్లాడారు, పోలీసులకు చెప్పినా: టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టుకు రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా శనివారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పైన చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు. సదరు ఎమ్మెల్యేపై తాను ఫిర్యాదు చేసినా ఏపీ పోలీసులు కేసు నమోదు చేయలేదని, చర్యలు తీసుకోలేదని చెబుతూ ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.
తనపై బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రోజా పెనమలూరు పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టును కోరారు.
ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీసు కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా గత నెల 9వ తేదీన బోడే ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారని, తనను అనుచిత వ్యాఖ్యలతో దూషంచారన్నారు. మహిళ అన్న కనీస మర్యాద, గౌరవం లేకుండా మాట్లాడారన్నారు.
ఈ నేపథ్యంలో తాను గత నెల 14న పెనమలూరు పోలీసులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్పై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోలేదన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది.