బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ : సీఎం జగన్ కు కానుకగా : 18.90 లక్షలతో..!!
గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఈ లడ్డు దక్కించుకొనేది ఎవరు.. ఎంతకు వేలం లో ధర పలుకుతుందనేది అందరూ ఆసక్తిగా చూసే అంశం. ఈ సారి అదే ఒరవడి కొనసాగింది. కానీ, ఈ సారి ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. ఈ సారి వేలం లో హోరా హోరీగా లడ్డు దక్కించుకొనేందుకు ప్రముఖులు పోటీ పడ్డారు. గణేశుడిని భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ బాలాపూర్ ప్రధాన వీధుల్లో ఊరేగిపు పూర్తి చేసుకున్న తరువాత బాలాపూర్ బొడ్రాయి సెంటర్ లో వేలం పాట నిర్వహించారు.
పెద్ద ఎత్తున పోటీ జరగ్గా..అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్సీ ..కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈ లడ్డును దక్కించుకున్నారు. ఆయన వేలంలో భాగంగా రికార్డు స్థాయిలో రూ 18.90 లక్షలకు ఈ లడ్డు దక్కించుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న విద్యా సంస్థ భాగస్వామి..నాదర్ గుల్ నివాసి అయిన మర్రి శశాంక రెడ్డితో కలిసి ఈ లడ్డు దక్కించుకున్నట్లుగా వెల్లడించారు. ఇక, ఈ లడ్డును ఏపీ సీఎం జగన్ కు కానుకగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బాలాపూర్ ప్రజల సమక్షంలోనే ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు చెప్పారు. ఇక, ఈ బాలాపూర్ లడ్డు వేలం 1994 నుంచి కొనసాగుతోంది. గత 27 ఏండ్లుగా ఉత్సవ సమితి లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతేడాది లడ్డూ వేలం జరగలేదు. మొదటిసారిగా లడ్డూ వేలం రూ.450తో ప్రారంభమైంది. 2010 నాటికి రూ.10.32 లక్షలకు చేరింది. 2019లో కొలన్ రాం రెడ్డి రూ.17.6 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16.6 లక్షలకు గణేశుని లడ్డూ సొంతం చేసుకున్నారు.
కాగా, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలాపూర్ గణేశుడికి చోటు దక్కింది. ఇప్పుడు ఏపీకి చెందిన ఎమ్మెల్సీ ఈ సారి లడ్డు దక్కించుకోవటం మరో ప్రత్యేక అంశంగా మారింది. తాజాగా గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఏపీ సీఎం జగన్ కడప జిల్లా కు చెందిన రమేష్ యాదవ్ ను ఎమ్మెల్సీగా సిఫార్సు చేసారు. ఆ తరువాత గవర్నర్ ఆమోదంతో ఆయన శాసన మండలి సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడు బాలాపూర్ లడ్డు దక్కించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జన దినోత్సవం నాడు వార్తల్లో నిలిచారు.