టీడీపీని మించిపోయిన వైసీపీ..ఎక్కడా తగ్గట్లేదు... డబ్బులే డబ్బులు..!
హైదరాబాదు: ఎప్పుడూ కరోనావార్తలు చదివేవారికి ఇదొక పొలిటికల్ హాట్ న్యూస్. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా దూసుకుపోతున్న కారు పార్టీ.. తాజాగా పార్టీ విరాళాల్లో కూడా దూసుకెళుతోంది. అంతేకాదు వైసీపీ టీడీపీలకు కూడా భారీగా విరాళాలు వచ్చాయి. ఈ విషయం అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్)వెల్లడించింది. ఎన్నికల కమిషన్కు ఆయా రాజకీయ పార్టీలు సబ్మిట్ చేసిన పార్టీ ఫండ్స్ వివరాలను ఏడీఆర్ సంస్థ స్టడీ చేసింది.
పొలిటికల్ డొనేషన్స్..
2017-18లో టీఆర్ఎస్ పార్టీకి 3.307 కోట్లు విరాళాల రూపంలో రాగా 2018-19లో అది కాస్తా రూ. 41.275 కోట్లకు చేరింది. ఇదిలా ఉంటే ఇక ఆయా రాజకీయా పార్టీలకు మొత్తం మీద విరాళాలు అత్యధికంగా వచ్చిన రాష్ట్రాల్లో రూ.45.227 కోట్లతో తెలంగాణ రెండో రాష్ట్రంగా నిలిచింది. ఇక ఏపీకి చెందిన మరో రెండు తెలుగు పార్టీలు అయిన వైసీపీ మరియు టీడీపీలు కూడా విరాళాల్లో రికార్డును నెలకొల్పాయి. ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 2018-19లో వైసీపీకి రూ.80.575 కోట్లు రాగా ఇది 2017-18తో పోలిస్తే 865శాతం అధికంగా ఉందని ఏడీఆర్ సంస్థ తెలపింది. ఇదిలా ఉంటే ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ 26.179 కోట్ల విరాళంతో నాలుగో స్థానంలో నిలిచింది. 2017-18లో టీడీపీకి విరాళాల రూపంలో వచ్చిన మొత్తం 1.737గా ఉంది. అంటే 1407శాతం అధికంగా ఈసారి పెరిగినట్లు ఏడీఆర్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.
బడా కార్పొరేట్ సంస్థల నుంచే విరాళాలు...
వైసీపీకి 142 మంది లేదా సంస్థలు విరాళాలు ఇచ్చాయి. ఇందులో 43 విరాళాలు బడా కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయి. ఎన్నికల కమిషన్ వద్ద 25 ప్రాంతీయ పార్టీలు తమ విరాళాల జాబితాను సమర్పించాయి. ఇందులో 292 విరాళాలు కార్పొరేట్ బిజినెస్ సంస్థల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ వివరించింది. ఈ మొత్తం రూ.188.42 కోట్లు ఉండగా... 2018-19లో 3,414 మంది వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చారని ఏడీఆర్ పేర్కొంది. వీరి వద్ద నుంచి విరాళాల రూపంలో వచ్చిన మొత్తం రూ.39.97 కోట్లు అని వెల్లడించారు. వైసీపీ డిక్లేర్ చేసిన విరాళాల ప్రకారం కార్పొరేట్ మరియు బిజినెస్ సెక్టార్లకు చెందిన వారి నుంచి విరాళాల రూపంలో రూ. 70.61 కోట్లు వచ్చాయని 78 మంది వ్యక్తిగత దాతల ద్వారా 9.74 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి డొనేషన్స్ వచ్చిన ఏకైక పార్టీగా అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ఆద్మీ పార్టీ నిలిచింది.
Recommended Video
ఢిల్లీ వేదికగా పనిచేసే సంస్థ నుంచే...
ఇక తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు పలువురు కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చాయి. ఇందులో ఢిల్లీ వేదికగా నడుస్తున్న ప్రూడెంట్ ఎలక్టరాల్ ట్రస్ట్ టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీలకు విరాళాలు ఇచ్చిందని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. వైసీపీకి ఈ సంస్థ నుంచి రూ.27 కోట్లు విరాళంగా ఇవ్వగా.. టీడీపీకి రూ. 15 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. ఆంద్రు మినెరల్స్, ఎంవీవీ బిల్డర్స్, రాగ కన్స్ట్రక్షన్స్, ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీవెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్సంస్థలు వైసీపీ టీడీపీలకు విరాళం అందజేశాయి.