వైఎస్ షర్మిలతో గిరిజన నేతల భేటీ: కేసీఆర్ సర్కార్పై కంప్లైంట్స్: వైఎస్సార్ హయాంలో అలా!
హైదరాబాద్: త్వరలో పార్టీనీ అధికారికంగా ప్రకటించబోతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైెస్ షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లో దూసుకెళ్తోన్నారు. ఇప్పటికే మూడు జిల్లాలకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించిన ఆమె.. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించబోతోన్నారు. వచ్చేనెల 10వ నాటికి అన్ని జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమావేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అనంతరం జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ క్రమంలో- తెలంగాణ గిరిజన శక్తి ప్రతినిధులు ఆమెను కలిశారు. లోటస్ పాండ్లోని షర్మిల నివాసంలో ఆమెతో మర్యాదపూరకంగా భేటీ అయ్యారు. గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేష్ చౌహాన్, జాతీయ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కే శరత్ నాయక్, ఇతర నాయకులు షర్మిలను కలిశారు. తెలంగాణలో గిరిజనులు ఎదుర్కొంటోన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించుకోవడానికి తాము చేస్తోన్న ప్రయత్నాలు, పోరాటాల గురించి వివరించారు. సుమారు 45 నిమిషాల పాటు వారి మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గిరిజనులకు పోడు భూములను ఇచ్చారని వివరించారు. పోడు భూములను తమకు ఇవ్వడం వల్ల ఆర్థికంగా స్వావలంబనను సాధించడానికి నాటి పథకం ఉపయోగ పడిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తరువాత.. దాని ఊసే లేకుండా పోయిందని వారు షర్మిలకు వివరించారు. రాష్ట్రావిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పటికీ పోడు భూములను ఇవ్వలేదని గుర్తు చేశారు. దాని కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. పోడు భూముల మంజూరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలుకు నోచుకోవట్లేదని చెప్పారు.
తండా బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం గురించి వారు షర్మిలకు వివరించారు. తండాల అభివృద్దికి నిధులను త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు, వాటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో ప్రత్యేకంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ దిశగా ఇదివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ.. దాన్ని కార్యరూపంలో పెట్టలేదని అన్నారు. అలాగే- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ తాము పోెరాడుతున్నామని చెప్పారు. వారి డిమాండ్ల పట్ల షర్మిల సానుకూలంగా స్పందించారు. వారి పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.