వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా వెనుక: నెల తరువాతే టూర్: ఈలోగా..?
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల.. తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీని నెలకొల్పడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తోన్నారు. ఇప్పటికే ఓ విడత జిల్లా స్థాయి వైఎస్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులతో సమావేశాలను నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా పర్యటనతో దీన్ని లాంఛనంగా ప్రారంభిచాలని భావించారు. ఆమె ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల నిర్వహించ తలపెట్టిన ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా పడింది.
ఎన్నికల షెడ్యూల్తో బ్రేక్..
తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు చొప్పున శాసన మండలి స్థానాలకు ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదన ఈ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం నోటిఫికేషన్ రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకేసారి విడుదల కానుంది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు చొప్పున..
ఏపీలో రెండు ఉపాధ్యాయ, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు కూడా ఒకేసారి ఎన్నికలు రాబోతోన్నాయి. ఏపీలో తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు రాబోతోన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి చిన్నారెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది.
నెల రోజుల గడువు..
ఈ పరిణామాల మధ్య ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే.. మళ్లీ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. వచ్చేనెల 14వ తేదీన శాసన మండలి స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. సుమారు నెల రోజుల సమయం లభించడం వల్ల ఈ లోగా.. ఇతర జిల్లాలకు చెందిన పార్టీ అభిమానులు, సానుభూతిపరులతో భేటీ కావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విడత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అభిమానులతో సమావేశం కావాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీ రిజిస్ట్రేషన్ పైనా..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియను షర్మిల త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియను కొండా రాఘవరెడ్డికి అప్పగించారు. పార్టీ ఎన్నికల గుర్తు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వ్యవహారాలకు సంబంధఇంచిన సమాచారం త్వరలోనే వెలువడుతుంది. చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభ నాటికి ఇదంతా పూర్తి చేయాలని షర్మిల భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడటం, నెల రోజుల వ్యవధి లభించడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు.