జహీరాబాద్ అత్యాచార కేసులో ఊహించని మలుపు: కారు బోల్తా, నిందితుడు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
సంగారెడ్డి: జహీరాబాద్ అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. మంగళవారంఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఓ మహిళను పోలీసులమని చెప్పి.. బస్సు దించి.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుళ్లారు దుండుగులు. ఆ తర్వా త ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులను చూసి వేగం పెంచి.. ప్రాణాలు తీసుకున్నారు..
సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే, రాయ్కోడ్ మండలం మహబత్పూర్ వద్ద పోలీసులను గమనించి అత్యాచార నిందితులు తమ కారు వేగాన్ని పెంచారు. అతివేగం కారణంగా ఆ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో నిందితుల్లో ఒకరు మృతి చెందగా, మరో నిందితుడు తీవ్రగాయాలపాయ్యాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
పోలీసులమని చెప్పి.. మహిళ వద్దకు..
మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేటకు చెందిన మహిళ(37) తన 12ఏళ్ల కుమారుడితో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్కు బస్సులో వస్తోంది. ఈ క్రమంలో జహీరాబాద్ పస్తాపూర్ కూడలి వద్ద ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి.. ఆమె వద్దకు వచ్చారు. ఆమె లగేజీలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయని, తనిఖీ చేయాలని ఆ మహిళను కిందికి దించారు.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకం..
లగేజీని పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుడిని తమ వద్ద ఉంచుకోగా.. మరో వ్యక్తి మాట్లాడాలంటూ మహిళను సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వెనుకబైపు ఉన్న పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సీఐ సైదేశ్వర్, ఎస్ఐ వెంకటేశ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
సీసీ కెమెరాల్లో నిందితుల గుర్తింపు..
కాగా, ఆ పాడుబడిన ఇంట్లో అత్యాచారానికి పాల్పడుతుండగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారని.. దీంతో నిందితుడు అక్కడ్నుంచి పరారైనట్లు బాధితురాలు తెలిపింది. ఘటనపై అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బస్సు దిగిన సమయంలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నిందితులను ఆ ఫుటేజీలో గుర్తించారు. వారి కోసం ఇప్పటికే గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితులకు ప్రమాదం జరగడంతో ఒకరు మృతి చెందగా, మరో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మూడో నిందితుడి గురించిన సమాచారం తెలియాల్సి ఉంది.