తెలంగాణాకు కేటాయించింది సున్నా , ఇది ఎన్నికల రాష్ట్రాల బడ్జెట్ : టీ కాంగ్రెస్ నేతల ఫైర్
కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది . ఈ బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని తెలుగు రాష్ట్రాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన కేటాయింపులు జరగలేదని, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎన్నో ప్రాజెక్టులపై ఒక్క మాటైనా లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సామాన్యుల నడ్డి విరిచే బడ్జెట్, ఎన్నికలు జరిగే రాష్ట్రాల కోసం మాత్రమే ఈ బడ్జెట్ అంటూ బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతుంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల బడ్జెట్ లా ఉంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇక కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది కేంద్ర బడ్జెట్ లా లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ లా మాత్రమే ఉందంటూ విమర్శించారు. తమిళనాడు, కేరళ ,అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టును కేటాయించారని, అన్ని రాష్ట్రాలకు రావలసిన సొమ్ము కొన్ని రాష్ట్రాలకు పంచుతున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు.
విభజన చట్టంలోని హామీలను గాలికొదిలేశారని ఆగ్రహం
కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాల కోసం మాత్రమే బడ్జెట్ తయారు చేసినట్లు గా ఉందని విమర్శించారు. ఇప్పటికే అధిక పెట్రోల్ ధరలు తో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజానీకాన్ని పెట్రోల్ మీద సెస్ వేసి ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ఇక రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పడం పచ్చి అబద్ధమని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ధరపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా రైతుల ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో చెప్పాలంటూ విమర్శించారు. విభజన చట్టంలోని హామీలను గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు .
పేదింటి బడ్జెట్ అని చెప్పినా పేద వారికి రాయితీలు ఎక్కడా లేవు : పొన్నాల లక్ష్మయ్య
ఉపాధి రంగాన్ని కాపాడడానికి ఎక్కడా బడ్జెట్లో కేటాయింపులు లేవని, పేదింటి బడ్జెట్ అని చెప్పిన పేద వారికి సంబంధించిన రాయితీలు ఎక్కడా కనిపించలేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో చాలా పెద్దదని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్ మెట్రో పొడిగింపుకు, విస్తరణకు కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితులు ఉంటే అరవై నాలుగు వేల కోట్లు హెల్త్ కు కేటాయిస్తే సరిపోతుందా అని ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల చుట్టూనే బడ్జెట్ ఉందంటూ విమర్శించారు.
తెలుగు మహిళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలా ఉంటుందా .. కాంగ్రెస్ అసహనం
ఇక దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిపైన సెస్ వేస్తామని చెప్పడం మరింత దారుణమన్నారు పొన్నాల లక్ష్మయ్య. ఒక తెలుగు మహిళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇలా ఉంటుందా అంటూ పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ లో తెలంగాణాకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు .