గ్రూప్-2 అభ్యర్థులకు భారీ షాక్.. : కొత్త జిల్లాల దెబ్బతో..
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ నిరుద్యోగ అభ్యర్థుల నిరీక్షణను మరింత పెంచనుంది. ఇప్పటికే ఓ సారి వాయిదా పడ్డ గ్రూప్-2 పరీక్షలు కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి రావడంతో మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గ్రూప్-2 పోస్టులు జోనల్ విభాగాలతో ముడిపడి ఉండడంతో, జిల్లాల విభజన పూర్తయితే గానీ ఏ పోస్టును, ఏ పరిధిలో భర్తీ చేయాలనే దానిపై స్సష్టమైన అవగాహన వచ్చేలా లేదు. దీంతో గత ఏప్రిల్ నెలలో వాయిదా పడ్డ పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టు గత నెలలోనే 439 పోస్టుల భర్తీకి గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉన్నా..! తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయన్న కారణంగా పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం.
అప్పటికే దృష్టిలోకి వచ్చిన 439 పోస్టులతో పాటు మరిన్ని అదనపు పోస్టులు జతచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొత్తం 460 కి పైగా పోస్టులకు నోటీఫికేషన్ వస్తుందని భావించారు అభ్యర్థులు. ఇదిలా ఉండగానే ఇప్పుడు కొత్త జిల్లాల ప్రక్రియ ఊపందుకోవడంతో నోటిఫికేషన్ విడుదలలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఆయా జిల్లాల కింద ఉన్న కొన్ని మండలలాతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పాటవబోయే జిల్లాలో ఏ జోనల్ కిందకు వస్తాయనేది తేలితే గానీ ఏ జోనల్ లో పోస్టుల భర్తీకి అవకాశం కల్పించాలనే దానిపై స్పష్టత రాదు.
ప్రస్తుతం ఐదో జోన్ పరిధిలో ఉన్న వరంగల్, ఆరో జోనల్ పరిధిలో ఉన్న నల్గొండలోని మొత్తం 14 మండలాలను కలిపి యాదాద్రిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే ఆరో జోన్ పరిధిలో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాలోని 5 మండలాలు, వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేటను కొత్త జిల్లా కేంద్రంగా చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
జోనల్ అంశాలపై స్పష్టత వచ్చి.. పోస్టుల ఖాళీ వివరాలు టీఎస్పీఎస్సీ కి అందడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.