ఇదిగో ఇక్కడ ఓ వ్యక్తి సహాయంతో నడుస్తున్నట్లు కనిపిస్తున్న చిన్నారి పేరు దివ్య. దివ్యను పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఆమె తండ్రి. దివ్య అందరిలానే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జన్మించింది. అందరి చిన్నారుల్లానే పుట్టగానే ఏడ్చింది. నెలలు గడుస్తున్న కొద్దీ నేలపై పాకింది. చక్కగా అమ్మ నాన్న అంటూ పిలిచేది. కానీ అప్పటి వరకు బాగున్న దివ్యపై విధి ఏదో పగబట్టినట్టుంది. ఒక్కసారిగా దివ్య నోటి వెంటా మాట రావడం ఆగిపోయింది. చేతులు కాళ్లు పనిచేయడం ఆగిపోయాయి. ఒక్కతే తన కాళ్లపై నిలబడలేక పోయింది. ఇలా జరగడంతో ఏమైందో తెలియని పరిస్థితి ఆ తల్లిదండ్రులది
తొలిసారిగా అమ్మ అని పిలవడం, నాన్న అని పిలవడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ సంతోషం లేదు. తమ బిడ్డ మాట్లాడిన ఆ రెండు పదాలనే తలుచుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. పనినుంచి తన తండ్రి ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ తండ్రి గుండెలను హత్తుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2017 డిసెంబర్ 27వ తేదీన చివరి సారిగా దివ్య మాట్లాడింది అలానే నిలబడింది. మరుసటి రోజు అంటే 28వ తేదీన మాత్రం ఒక్కసారిగా తన గొంతు మూగబోయింది. తన చేతులు కాళ్లపై నియంత్రణ కోల్పోయింది. నిల్చునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆది సాధ్యపడలేదు. కిందకు పడిపోయేది. అప్పుడే ఏదో జరిగిందనే అనుమానం తండ్రికి కలిగింది. హాస్పిటల్కు తీసుకెళ్లాడు.
హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్కు కూడా దివ్య పరిస్థితి అర్థం కాలేదు. దీంతో ఆయన పలు డాక్టర్ల దగ్గర చూపించాడు. వారంతా స్కాన్లు తీయాలని సూచించారు. ఆ రిపోర్ట్స్ రాగానే ఏదైనా సమస్య వచ్చిందా అని డాక్టర్ను అడగగా డాక్టర్ కంగారుపడొద్దంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతని భావాలు చూడగానే దివ్య తండ్రికి భయం వేసింది. ఇక చివరికి డాక్టర్ దివ్య పరిస్థితి గురించి చెప్పేశాడు. దివ్యకు మెదడు సంబంధిత వ్యాధి వచ్చిందని దానిపేరు ఎన్సిఫాలోపతి అని వైద్యులు చెప్పారు. ఇక ఈ వ్యాధికి చికిత్స గురించి డాక్టర్ వివరిస్తున్నప్పుడు తన మెదడులో మొత్తం మెలిగింది ఆ చికిత్సకు అయ్యే ఖర్చని తండ్రి చెప్పాడు.
ఇక చికిత్సకు అయ్యే ఖర్చు తాను భరించకపోతే తన బిడ్డ ఎప్పటికీ మాట్లాడలేదు, లేదా ఎప్పటికీ సొంతంగా నిలబడలేదని తెలుసుకున్న తండ్రి తనకు తెలిసిన వారంందరి నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. మిగతా డబ్బులు సమకూర్చుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాడు. ఏడాదికి రూ.60వేలు దివ్య చికిత్స కోసం ఖర్చు అవుతోంది. ఇప్పటికే రూ.లక్ష కేవలం పరీక్షలకు మాత్రమే ఖర్చు చేశాడు దివ్య తండ్రి. దివ్య తండ్రి ఆటో డ్రైవర్. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం తనది. ఇప్పుడు తన కూతురు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే దాతలు సహాయం చేయాల్సిందిగా దివ్య తండ్రి అర్థిస్తున్నాడు. దివ్య తప్పకుండా కోలుకుంటుందని వేలూరులోని సీఎంసీ వైద్యులు చెప్పారు. కానీ ఆలస్యం చేయరాదని సూచించారు.
ఇప్పటి వరకు దివ్య ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోంది.చికిత్సకు ఆటంకం కలిగితే దివ్య పరిస్థితి తిరిగి పూర్వ స్థితికి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కష్ట సమయంలో అంతా సహాయం చేయాలంటే కష్టమే అని చెబుతున్న దివ్య తండ్రి, తన కథను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎవరో ఒకరు స్పందించి సహాయం చేయకపోరా అనే చిన్న ఆశ అతనిలో ఉంది. తన కూతురు తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు సహాయం చేయాలని దివ్య తండ్రి వేడుకుంటున్నాడు.
RECOMMENDED STORIES