జగన్ అలా.. టీటీడీ ఇలా... కరోనా వేళ కనిపించని కనికరం...
ఏపీలో పనిచేస్తున్న దాదాపు 60 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వారి పదవీకాలం ముగిసినా లాక్ డౌన్ కారణంగా మరో నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయం తమకూ వర్తిస్తుందని భావిస్తున్న 1300 మంది ఉద్యోగులకు టీటీడీ షాకిచ్చింది. కాంట్రాక్టు కాలం ముగిసిన కారణంగా వీరిని విధుల నుంచి తప్పిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
తిరుమల తిరుపతి దేవస్ధానం పరిధిలో వివిధ పనుల కోసం పద్మావతి ఫెసిలిటీ మేనేజ్ మెంట్ సర్వీసెస్ అనే ఏజెన్సీ ఆధ్వర్యంలో 1300 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. వీరికి ప్రతీ ఏడాది రెన్యువల్ చేస్తుంటారు. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం, ఉద్యోగులతో ప్రస్తుతానికి ఎలాంటి పనీ లేకపోవడంతో టీటీడీ కాంట్రాక్టు పొడిగింపు ఇవ్వలేదు. దీంతో ఈ 1300 మంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్లయింది. ఇవాళ ఉదయం నుంచి వీరి సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.
ఓవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సీఎం జగన్.. తాజాగా దాదాపు 60 వేల మందికి పైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాల గడువును కాంట్రాక్టు ముగిసినా రెండు నెలల పాటు పొడిగించారు. ఆ తర్వాత పరిస్ధితుల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఇలాంటి సమయంలో టీటీడీ వంటి సేవాభావం కలిగిన ధార్మిక సంస్ధ ఏకంగా 1300 మంది ఉద్యోగులను తొలగించడం కలకలం రేపుతోంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని తమ కాంట్రాక్టు పొడిగించి కరోనా సమయంలో ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు.