తిరుపతి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు .. పలు కీలక పత్రాలు స్వాధీనం
ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల దాడులు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను, ఆస్పత్రులను , టీచింగ్ ఆస్పత్రులను జల్లెడ పట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే . ఇక తాజాగా అవినీతి అధికారుల భరతం పట్టటానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే అధికారుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు.
లంచావతారం ..ఏసీబీ వలలో వీఆర్వో .. ఏం జరిగినా మారరేం !!
అవినీతి అధికారులకు ఏసీబీ చెమటలు పట్టిస్తుంది ఏపీలో ప్రతి శాఖలోనూ పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు . తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి అటవీశాఖ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డిఎఫ్ఓ వెంకటా చలపతి నాయుడు నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి ఏసీబి దాడులు కొనసాగుతున్నాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపధ్యంలోనే దాడులు నిర్వహిస్తున్నారు .
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలపై అధికారులు అన్నారావు కూడలి సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్ వెనుకవైపు ఉన్న ఎం 2 గ్రాండ్ హోటల్ నాలుగో అంతస్థులో ఉన్న చలపతి నాయుడు నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తిరుపతితోపాటు కడప జిల్లా రాయచోటి, చిత్తూరు, బెంగళూరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు , నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.