ఏపీ బీజేపీకి సినీ గ్లామర్: కాషాయ కండువా కప్పుకొన్న నటి: రోజాపై కామెంట్స్!
తిరుపతి: భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ ఎట్టకేలకు సినీ గ్లామర్ను అద్దుకుంది. తెలుగుతో పాటు దక్షిణాదిన అన్ని భాషల సినిమాల్లో నటించిన ప్రియా రామన్ బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆమె పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనకు చేతనైనంత వరకు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ రోల్ మోడల్ అని, ఆయనను చూసే తాను బీజేపీలో చేరానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
కాంగ్రెస్-జేడీఎస్ దోస్తానా..డౌటేనా? రాహుల్ టార్గెట్లో సిద్ధు!
తన సహచర నటి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజా తనకు మంచి స్నేహితురాలని ప్రియా రామన్ అన్నారు. తరచూ తాను రోజాతో ఫోన్లో సంభాషిస్తుంటానని చెప్పారు. రాజకీయాల్లో మాత్రమే కాకుండా- చాలా విషయాల్లో తాను రోజాను చూసి స్ఫూర్తి పొందాననీ ప్రియా రామన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రస్తుతానికి తానేమీ వ్యాఖ్యానించబోనని చెప్పారు. రాష్ట్ర రాజకీయాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకున్న తరువాతే స్పందిస్తానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్రియారామన్ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. తెలుగులో ఆమె మొదటి సినిమా దొరబాబు. ఆ తరువాత కమల్హాసన్తో కలిసి శుభసంకల్పం, మావూరి మహరాజు, శ్రీవారి ప్రియురాలు వంటి సినిమాల్లో నటించారు. గత ఏడాది విడుదలైన పడిపడి లేచేమనసులోనూ మెరిశారు. కేరళలోని పాల్ఘాట్కు చెందిన ప్రియా రామన్ తమిళంలో డెబ్యూ మూవీతోనే సంచలనం రేపారు. 1993లో ఆమె రజినీకాంత్తో కలిసి వల్లి అనే సినిమాలో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు.