తిరుమలలో మళ్లీ చిరుత కలకలం - మ్యూజియం కాంప్లెక్స్ వద్ద సంచారం - ఘనంగా పౌర్ణమి గరుడసేవ
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా కలియుగ వైకుఠం తిరుమలలో భక్తుల రద్దీ అతికొద్దిగా ఉండటంతో వణ్యప్రాణుల సంచారం అంతకంతకూ పెరుగుతున్నది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆలయంలో దర్శనాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, భక్తుల సంఖ్య మునుపటిలా ఉండటంలేదు. దీంతో ఆవాసాల మధ్యలోకే అడవి జంతువులు తరుచుగా వస్తున్నాయి.
గత వారం ఘాట్ రోడ్డులో ఇద్దరు భక్తులపై ఓ చిరుత దాడికి యత్నించిన సంఘటన తిరుమలలో కలకలం రేపింది. చిరుతపులలతోపాటు రాత్రి సమయాల్లో ఎలుగుబంట్లు, పాములూ తిరుగుతోన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. తాజాగా మంగళవారం రాత్రి కూడా చిరుత సంచరించినట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ మాఢవీధికి దగ్గరగా ఉండే మ్యూజియం కాంప్లెక్స్ వద్ద చిరుత సంచరించిందని, మంగళవారం రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు అది అక్కడే తచ్చాడిందని, ఆ తర్వాత అడివిలోకి వెళ్లిపోయిందని తిరుమల అధికారులు తెలిపారు. చిరుత కదిలికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం బుధవారం విడుదల చేశారు. చిరుత వల్ల భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే,
తిరుమలలో బుధవారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించారు.
ఇటు, శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లపైనా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం టికెట్ల కోటాను బుధవారం నుంచి మరో వెయ్యికి పెంచింది. దీంతో ప్రతి రోజూ 13 వేల మందికి దర్శనభాగ్యం లభించనుంది. ఆఫ్ లైన్ లో 3వేలు, ఆన్ లైన్ లో 10వేల టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.