భారత్-పాక్ వార్: సాయంత్రం తిరుపతికి వైఎస్ జగన్: దక్షిణాదిన తొలిసారిగా: ఏపీతో ఆరంభం
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాస్సేపట్లో తిరుపతి పర్యటనకు రానున్నారు. ఆర్మీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను ఆయన సన్మానించనున్నారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం చోటు చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. స్వర్ణిమ్ విజయ్ మషాల్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కాగడాను వెలిగించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు ఈ కాగడాను తీసుకెళ్తారు. ఆ ఈ కాగడా తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెడుతోంది. తిరుపతితో దక్షిణాది దాని ప్రయాణం ఆరంభం కాబోతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అలిపిరి చెన్నారెడ్డి కాలనీలో నివసిస్తోన్న మేజర్ జనరల్ సీ వేణుగోపాల్ను ఆర్మీ అధికారులు సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.30 నిమిషాలకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.50 నిమిషాలకు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు.
అనంరతం తిరుపతిలో చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 7.10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం బయలుదేరి వెళ్తారు. ఏపీలో మరో రెండు ప్రాంతాలకు ఈ కాగడా వెళ్లనుంది. విశాఖపట్నం, కాకినాడల్లో నివసించే మాజీ సైనికులు సన్యాసి నాయుడు, కేజే క్రిస్టొఫర్ కుటుంబ సభ్యులను ఆర్మీ అధికారులు సన్మానించనున్నారు. అనంతరం ఈ కాగడా తమిళనాడుకు వెళ్తుంది.