ఎస్వీబీసీలో ప్రక్షాళన: సీఈఓపై వేటు: సివిల్ సర్వీసెస్ అధికారికి బాధ్యతలు: కేంద్రం బ్రాండ్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోన్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ)లో ప్రక్షాళన ప్రారంభమైంది. చారిత్రాత్మకమైన అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ..ఎస్వీబీసీలో కీలక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అత్యంత కీలకమైన ముఖ్య కార్యనిర్వహణాధికారి బాధ్యతలను అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారికి అప్పగించింది. ఎస్వీబీసీలో సివిల్ సర్వీసెస్ అధికారిని సీఈఓగా నియమించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎస్వీబీసీ ఛానల్ సీఈఓగా ఐఐఎస్ అధికారి సురేష్ కుమార్ గెదెల నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు. సురేష్ కుమార్ ప్రస్తుతం దూరదర్శన్ విజయవాడ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ (న్యూస్)గా పనిచేస్తున్నారు. డెప్యుటేషన్పై ఆయనను నియమించారు. ప్రస్తుతం ఎస్వీబీసీ సీఈఓగా పనిచేస్తోన్న నగేష్ను ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో సురేష్ కుమార్ బాధ్యతలను స్వీకరిస్తారు.
2011 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఐఎస్)కు చెందిన సురేష్ కుమార్.. ఎస్వీబీసీ సీఈఓగా మూడేళ్ల పాటు పనిచేస్తారు. రామమందిరం భూమిపూజ కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Recommended Video
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఇష్టమైన విశాఖ శారదాపీఠాన్ని సందర్శించితే ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, అలాంటిది శ్రీరామచంద్రుడికి గుడి కట్టడానికి సంబంధించిన భూమిపూజను నిర్వహించినా.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందులో పాల్గొన్నా.. ఎస్వీబీసీలో లైవ్ టెలికాస్ట్ చేయలేదంటూ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, అధికార ప్రతినిధి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వం సీఈఓ నగేష్ను తప్పించింది. సురేష్ కుమార్కు ఆ బాధ్యతలను అప్పగించింది.