జగన్ దెబ్బకు ''కొండ''దిగొచ్చారు: టీటీడీ ఈవో శ్రీనివాస రాజు బదిలీ:కొత్త నియామకం వెనుక పెద్దాయన
ముఖ్యమంత్రి దెబ్బకు కొండ పైనే పాతుకుపోయిన అధికారి దిగరాక తప్పలేదు. ఏడున్నారేళ్లకు పైగా ఒకే పోస్టులో ఉంటూ హవా సృష్టించిన టీటీడీపీ జేఈవో శ్రీనివాస రాజు ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రులు మారినా.. టీటీడీ చైర్మన్లు..ఈవోలు మారినా ఆయన్ను మాత్ర మార్చలేక పోయారు. ఢిల్లీలో రాజ్యంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి ఆశీస్సులతోనే ఆయన అక్కడ కొనసాగారనే ప్రచారం ఉంది. అదే విధంగా తాజా ఎన్నికల్లో ఆయన ఒక దశలో టీడీపీ నుండి పోటీ చేస్తారని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా టీటీడీ కొత్త ఛైర్మన్ను నియమించారు. ఇక, జేఈవో ను సైతం బదిలీ చేసారు. కొత్త జేఈవోగా మరో అధికారికి పోస్టింగ్ ఇచ్చారు.
శ్రీనివాస రాజుపై బదిలీ వేటు..నో పోస్టింగ్
ఏడున్నారేళ్లుగా తిరుమల కొండ మీద తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఎట్టకేలకు బదిలీ అయ్యారు. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్లో అధికారిగా ఉన్న సమయంలో ఆయన టీటీడీ ఈవోగా నియమితులయ్యారు . ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత అయిదేళ్ల కాలంలోనూ అక్కడే కొనసాగారు. దీని కోసం పలు మార్లు ఆయన్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దేశ రాజధానిలో రాజ్యాంగ వద్ద పదవిలో ఉన్న వ్యక్తి అండదండలతోనే ఆయన అంతకాలం టీటీడీలో కొనసాగారనే వాదన ఉంది. దీని కారణంగానే నాటి ముఖ్యమంత్రి సైతం ఆయన్ను బదిలీ చేయలేకపోయారు. అదే విధంగా టీటీడీలో ఈవో కంటే ఒక విధంగా శ్రీనివాస రాజే అన్ని విభాగాల్లోనూ కీలకంగా మారారు. ప్రముఖ వ్యక్తులు..పారిశ్రామిక వేత్తలు..రాజకీయ నేతలు .. న్యాయమూర్తులు ఎవరు శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీనివాస రాజు తన సమర్ధత చూపించేవారు. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారమూ సాగింది. నగరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ది రోజా పైన పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే, చివర్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ నిలిచిపోయింది.
జగన్ దెబ్బకు కొండ దిగి..సచివాలయానికి
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తిరుమల పర్యటన సమయంలో అక్కడ ప్రధానంగా వ్యవహరించిన కొందరు జేఈవో శ్రీనివాస రాజు వ్యవహార శైలి పైన ఫిర్యాదులు చేసారు. టీడీపీ నుండి పోటీ చేయాలని భావించిన వ్యక్తి..ఆ పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తారని కొందరు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సైతం జేఈవో తీరు పైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఛైర్మన్గా నియమితులైన సుబ్బారెడ్డి సైతం జేఈవో శ్రీనివాస రాజును బదిలీ చేయాలని సీఎం ను కోరినట్లు తెలుస్తోంది. తిరుమల లో పూర్తి శ్రీనివాస రాజు మను షులు ప్రతీ విభాగంగా ప్రభావితం చూపుతున్నారని..మార్పు తేవాలంటే ఆయన్ను తప్పించాలని సీఎంకు నివేదిక ఇచ్చారు. ఫలితంగా సీఎం జగన్ ఆ పోస్టులో సరైన వ్యక్తి కోసం ఎదురు చూసారు. ఇక, ఆలస్యం చేయకూడదని భావించి శ్రీనివాస రాజును బదిలీ చేసి ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
కొత్త జేఈఓ నియామకం..వెనుక పెద్దాయన
టీటీడీ జేఈవోగా ఉన్న శ్రీనివాస రాజును బదిలీ చేసి ఆయన స్థానంలో ప్రస్తుతం విశాఖ మెట్రో పాలిటిన్ రీజనల్ డెవలప్ మెంట్ అధారిటీ కమిషనర్గా పని చేస్తన్న ఐఏయస్ అధికారి బసంత్ కుమార్ను నియమించారు. ఆయన గతంలో గవర్నర్ నరసింహన్ వద్ద సుదీర్ఘ కాలం ఓఎస్డీగా..అదే విధంగా సంయుక్త కార్యదర్శిగా పని చేసారు. విధి నిర్వహణలో సున్నితంగా వ్యవహరించే బసంత్ కుమార్ తన కుమారుడి వివాహం కోసం కేవలం 18 వేల రూపాయలను ఖర్చు చేసి ఆదర్శంగా నిలిచారు. బసంత్ గురించి రాష్ట్ర స్థాయిలో రాజ్యంగ బద్దమైన స్థానంలో ఉన్న పెద్దాయన సీఎం జగన్కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికే ఆయనకు విశాఖలో పోస్టింగ్ ఇవ్వటంతో....ఇప్పుడు జేఈవో బదిలీ సమయంలో ఆయనకు సీఎం అవకాశం ఇచ్చారని సమాచారం. వెంటనే బసంత్ కుమార్ను విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.