తిరుపతిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి ?రేసులో మాజీ సీఎస్ రత్నప్రభ-బీజేపీ పొత్తుకు టీడీపీ త్యాగం ?
ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతుండగా... ఇవి ముగిసేలోపే మరో పోరు ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ స్ధానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో అనివార్యంగా మారిన ఉపఎన్నికకు ఈ నెలలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. దీంతో తిరుపతి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులను సూచనప్రాయంగా ప్రకటించిన వైసీపీ, టీడీపీ మారుతున్న పరిస్దితుల్లో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ మరింత గట్టి అభ్యర్ధి కోసం ప్రయత్నిస్తుండగా.. విపక్షం అయితే ఏకంగా ఉమ్మడి అభ్యర్ధి కోసం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల వ్యయపరిమితులివే- 2011 జనాభా ప్రకారమే
రసవత్తరంగా తిరుపతి ఉపఎన్నిక
తిరుపతిలో త్వరలో జరిగే లోక్సభ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఓ టర్నింగ్ పాయింట్ తెచ్చేలా కనిపిస్తోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉపఎన్నిక అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. వైసీపీకి సిట్టింగ్ స్ధానం కావడం, తాము అధికారంలో ఉంటూ ఉపఎన్నికను ఎదుర్కోవాల్సి రావడం, ఏమాత్రం తేడా వచ్చినా విపక్షాలు తమ రెండేళ్ల పాలనకు దీన్ని రెఫరెండంగా చూపే అవకాశం ఉండటంతో అధికార పార్టీకి పెను సవాలు తప్పడం లేదు. సాధారణంగా చూస్తే 151 అసెంబ్లీ సీట్లు, 22 మంది ఎంపీలతో దుర్భేద్యంగా కనిపిస్తున్న వైసీపీకి ఇదో లెక్క కాదు. కానీ మారిన పరిస్ధితుల్లో విపక్షాల దూకుడుతో వైసీపీకి సవాళ్లు తప్పడం లేదు.
అభ్యర్ధుల్ని ప్రకటించిన వైసీపీ, టీడీపీ
తిరుపతి ఉపఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా అనధికారికంగా ప్రకటించింది. వైసీపీ కూడా సీఎం జగన్ ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని అభ్యర్ధిగా దాదాపుగా ఎంపిక చేసింది. ఎన్నికలకు మూడు నెలల ముందే ఇరుపార్టీలు ఈ మేరకు అభ్యర్ధులకు క్లారిటీ ఇచ్చేశాయి. అయితే ఇప్పుడు పరిస్ధితులు మారుతున్నాయి. స్ధానిక ఎన్నికల్లో్ హోరాహోరీ పోరుతో విపక్షాలు పట్టు పెంచుకుంటున్నాయి. దీంతో అధికార వైసీపీ కూడా ఇప్పుడు వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. వైసీపీయే కాదు విపక్ష పార్టీలు కూడా తమ వ్యూహాలు మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
మలైకా అరోరా అంగాంగ ప్రదర్శన.. అర్ధనగ్నంగా ఫోటోషూట్
తిరుపతి బరిలో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి
తిరుపతి ఉప ఎన్నిక కోసం అందరి కంటే ముందుగా అభ్యర్ధిని ప్రకటించిన టీడీపీ.. ఇప్పటికే అక్కడ పాగా వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీజేపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు బీజేపీ-జనసేన అభ్యర్ధికి పోటీగా తాము అభ్యర్ధిని రంగంలో ఉంచితే భవిష్యత్తులో బీజేపీతో పొత్తుకు ఇబ్బందిగా మారొచ్చు. దీంతో తిరుపతి బరి నుంచి తప్పుకుని బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్ధికి మద్దతివ్వడం ద్వారా పాత పొత్తులకు కొత్తగా ద్వారాలు తెరుచుకునే అవకాశం పొందవచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ పైకి ఏమీ చెప్పకపోయినా టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మితో పాటు టీడీపీ పెద్దల మౌనం చూస్తుంటే ఇదే అనుమానం కలుగుతోంది. బీజేపీ అభ్యర్ధి ప్రకటనలో ఆలస్యం వెనుక కారణం కూడా ఇదేననే చర్చ జరుగుతోంది.
తిరుపతిలో విపక్షాల అభ్యర్ధిగా రత్నప్రభ ?
కర్నాటక కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ రత్నప్రభా పాటిల్ ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికల్లో ఏపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నాటక సీఎస్గా పదవీ విరమణ చేయగానే బీజేపీ తీర్ధం పుచ్చుకున్న రత్నప్రభను తిరుపతిలో రంగంలోకి దించడం ద్వారా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాషాయనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు టీడీపీ సహకారం కూడా కోరుతున్నట్లు అర్దమవుతోంది. టీడీపీ ఎంపీలతో నిన్న అమిత్షా భేటీ తర్వాత త్వరలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన, బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కూడా జరిగితే ఈ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చనున్నాయి.
బీజేపీ-టీడీపీ పొత్తుకు రూట్ క్లియర్ చేస్తుందా ?
తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ ప్రతిపాదించిన ఉమ్మడి అభ్యర్ధికి టీడీపీ కనుక మద్దతు ఇస్తే అది రాజకీయంగా ఆ పార్టీకి కలిసివస్తుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. అదే సమయంలో వైసీపీ కేంద్రంతో సఖ్యత ప్రదర్శిస్తోంది. దీంతో బీజేపీ సహకారం లేకుండా ప్రస్తుతం రాజకీయాలు కష్టమేనన్న భావన టీడీపీలో కనిపిస్తోంది. తిరుపతిలో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో జమిలి ఎన్నికలు జరిగినా లేక వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకైనా ఆ పొత్తు కొనసాగుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో తిరుపతిలో సహకారం బీజేపీకి భవిష్యత్తులో లాభిస్తుందనుకుంటే టీడీపీ ఉమ్మడి అభ్యర్ధికి ఓటేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో బీజేపీ అభ్యర్ధికి టీడీపీ మద్దతిస్తే ఏపీలో ఆ పార్టీకి ఆత్మహత్యాసదృష్యం అవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరికశ్లూ టీడీపీ నిర్ణయం పైనే ఉన్నాయి.
Recommended Video