TTD: టీటీడీ కీలక నిర్ణయం: సంక్రాంతి తరువాత కఠినంగా అమలు..!
అమరావతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందడుగు వేసింది. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన తరువాత.. దాన్ని ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో అమలు చేయట్లేదు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి తరువాత ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే దిశగా కఠిన చర్యలను తీసుకోనుంది. కనుమ పండుగ మరుసటి రోజు నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదిస్తూ ఇదివరకే టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీవారి ప్రసాదమైన లడ్డూలను కూడా కాగితంతో తయారు చేసిన సంచుల్లో భక్తులకు అందజేస్తామని ప్రకటించారు. శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల ఒక్కసారిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం కష్టసాధ్యమని భావించారు. దశలవారీగా దాన్ని అమలు చేస్తూ వచ్చారు.
సంక్రాంతి తరువాత ఇక పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. తిరుమల, తిరుపతిలల్లో బ్యానర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ సహా శ్రీనివాసం, విష్ణునివాసం వంటి వసతి గృహాల్లో సైతం భక్తులకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. ప్లాస్టిక్ ను వినియోగించే భక్తులపై జరిమానాలను విధించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
సాధారణంగా భక్తులు తమ వెంట ప్లాస్టిక్ బాటిళ్ల మంచినీటిని తీసుకొస్తుంటారని, ఆ పరిస్థితి తలెత్తకుండా తిరుమల వ్యాప్తంగా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సీజన్ లో కురిసిన భారీ వర్షాల వల్ల తిరుమలలోని పాపనాశం పూర్తిగా నిండిందని, ఇప్పట్లో మంచినీటి కొరత ఏర్పడే అవకాశం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కనీసం రెండేళ్లకు సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.