తిరుమలలో శ్రీవారి పుష్కరిణీ పవిత్ర జలాలు..మట్టిని సేకరించిన బీజేపీ నేతలు: ఎందుకంటే?
తిరుపతి: మరి కొద్దిరోజులు. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. తాము ఆరాధించే శ్రీరామచంద్రుడి ఆలయ నిర్మాణానికి పునాదిరాళ్లు పడబోతున్నాయి. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన వైభవంగా భూమిపూజ మహోత్సవాన్ని నిర్వహించడానికి శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఈ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల నుంచి పవిత్ర జలాలు, మట్టిని అయోధ్యకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రామమందిరం భూమిపూజకు వాటిని వినియోగిస్తారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ నాయకులు తిరుమల నుంచి పవిత్ర జలాలు, మట్టిని సేకరించారు. చిత్తూరు జిల్లా బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి మరి కొందరు నేతలు తిరుమల శ్రీవారి పుష్కరిణీ నుంచి తీర్థాన్ని, పాపనాశం సమీపంలో పుట్టమన్నును సేకరించారు.
వాటిని అయోధ్యకు పంపించబోతున్నామని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు, పుష్కరిణీల నుంచి పవిత్ర జలాలు, మట్టిని సేకరించి అయోధ్యకు పంపించబోతున్నామని అన్నారు. తరతరాల పాటు చరిత్రలో నిలిచిపోయేటటువంటి రామ మందిరం నిర్మాణానికి నిర్వహించబోయే భూమిపూజలో వాటిని వినియోగిస్తారని చెప్పారు. ఓ చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నారని అన్నారు.
Recommended Video
కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు అనుగుణంగా రామమందిరం రూపుదాల్చుతుందని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. శతాబ్దాల పాటు న్యాయస్థానంలో నలిగిన ఈ అంశం పరిష్కారానికి నోచుకోవడం, ఆ వెంటనే రామ మందిరం నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ప్రతి ఒక్క హిందువు ఒక్కసారైనా రామ మందిరాన్ని దర్శించుకోవాలని తాను కోరుకుంటున్నానని భానుప్రకాశ్ రెడ్డి చెప్పారు.