తిరుమలలో చంద్రబాబు కుటుంబం: దేవాన్ష్ పుట్టినరోజు నాడు శ్రీవారి దర్శనం
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వారు తిరుమలకు చేరుకున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
వైఎస్ వివేకా హత్య విచారణ సాగేదెలా? దర్యాప్తును ప్రభావితం చేసేలా చంద్రబాబు, జగన్ వ్యాఖ్యాలు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. స్వామివారిని దర్శించుకుని వెలుపలికి వచ్చిన అనంతరం సమీపంలోనే ఉన్న రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు.
దేవాన్ష్ పుట్టినరోజు నాడు చంద్రబాబు కుటుంబం తిరుమలకు రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. గత ఏడాది కూడా వారు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా వెంట ఉన్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో వారు తీరిక లేకుండా ఉన్నందున తిరుమలకు రాలేకపోయారు.
దేవాన్ష్ పుట్టిన రోజు సందర్బంగా అన్న ప్రసాద వితరణకు ఒకరోజు అయ్యే ఖర్చు మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం చెల్లించింది. 30 లక్షల రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు అందజేశారు. దేవాన్ష్తో కలసి స్వామివారిని దర్శించుకున్న సీఎం సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి వెంగమాంబ అన్నప్రసాదం భవనానికి చేరుకుని భక్తులకు వడ్డించారు. అనంతరం అక్కడే సాధారణ భక్తులతో కలసి అల్పాహారం ఆరగించారు.