అమరావతి వద్దు..దొనకొండా వద్దు.. మా తిరుపతిని రాజధానిగా ప్రకటించండి: కేంద్ర మాజీమంత్రి కొత్త డిమాండ్
తిరుపతి: కృష్ణానదికి సంభవించిన వరదల వల్ల అమరావతి పరిధిలో అనేక ప్రాంతాలు మునిగిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం రాజధానిని తరలించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు కూడా. ప్రకాశం జిల్లా దొనకొండకు రాజధానిని తరలించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదికి తీసుకొచ్చారు. అమరావతి, దొనకొండ కాకుండా.. తిరుపతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ను అరెస్టు చేయండి: గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని అమరావతి నుంచి తరలించడం ఖాయమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి వైఎస్ జగన్ ఆశించిన స్థాయిలో కేటాయింపులు చేయలేదని, కేవలం 500 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకొన్నారని చెప్పారు. రాజధాని తరలింపుపై అప్పుడే తనకు అనుమానాలు మొదలయ్యాయని అన్నారు. తన అనుమానాలకు బలం కలిగించేలా తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చేశారని చింతా మోహన్ చెప్పారు. రాజధాని తరలింపుపై వైఎస్ జగన్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సంప్రదించినట్లు తన వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు.
అమరావతి నుంచి దొనకొండకు రాజధానిని తరలించే విషయంలో వైఎస్ జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతి తరలింపు అనే విషయం వేలమంది రైతుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నదని చింతామోహన్ చెప్పారు. వైఎస్ జగన్ సర్కార్ రాజధానిపై అనుసరిస్తోన్న వైఖరి ఫలితంగా అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల పంట పొలాలను ఇచ్చిన రైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పైగా రాజధానిగా దొనకొండ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని ప్రాంతమని అన్నారు. అన్ని వనరులు ఉన్న తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ రాజధానిపై అనుసరిస్తున్న వైఖరితో భూములిచ్చిన రైతుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.