ఎస్వీబీసీ ఛానెల్ ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఛైర్మన్ పోస్ట్ కొన్నాళ్లు ఖాళీనే..?
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్(ఎస్వీబీసీ) ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పదవిని సృష్టించిన ప్రభుత్వం.. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని ఆ పదవిలో నియమించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీలో దళారీ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ధర్మారెడ్డి కీలకంగా పనిచేశారన్న పేరు ఉంది. ఎస్వీబీసీని కూడా గాడిన పెడుతారన్న ఉద్దేశంతోనే ఆయన్ను ఎండీ పదవిలో నియమించినట్టు తెలుస్తోంది. ఇక ఛైర్మన్ పోస్టును ఖాళీగానే ఉంచి.. అదనంగా మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఎస్వీబీసీలో పృథ్వీ ఉదంతంతో ఛైర్మన్ పదవిని ఖాళీగానే ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిని లైంగిక వేధించారన్న ఆరోపణలతో పృథ్వీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఆడియో లీక్ అవడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ ఆడియో కారణంగా పృథ్వీపై ఆరోపణలు రావడం, రాజీనామా చేయడం ఒకే రోజు జరిగిపోయాయి.
పృథ్వీ రాజీనామా తర్వాత ఛైర్మన్ రేసులో జర్నలిస్టు స్వప్న,మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు,దర్శకుడు శ్రీనివాస్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. స్వప్న,శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఎస్వీబీసీ డైరెక్టర్లుగా ఉండటంతో.. వీరిద్దరిలో ఎవరినైనా నియమించవచ్చుననే ప్రచారం జరిగింది. ఛైర్మన్ పదవిలో మహిళను నియమించడం ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో.. సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న స్వప్నకే పదవి దక్కవచ్చునని చాలామంది భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం కొన్నాళ్ల వరకు ఛైర్మన్ పదవిని ఖాళీగానే ఉంచాలని నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం.