టీటీడీ పాలక మండలి సిద్దం : 25 మందికి జగన్ ఆమోదం..వీరికి ఖరారు : ఇద్దరు పారిశ్రామికవేత్తలకు చోటు..!!
Recommended Video
ఎంతో కాలంగా ఆశావాహులు ఎదురు చూస్తున్న ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం ఖరారైంది. ముఖ్యమంత్రి జగన్ అనేక తర్జన భర్జనల తరువాత తుది జాబితాకు ఆమోద ముద్ర వేసారు. గతంలో ఉన్న 19 మంది సభ్యులను 25 మందికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీతో పాటుగా తెలంగాణ.. కర్నాటక..తమిళనాడు..మహారాష్ట్ర నుండి సభ్యులుగా అవకాశం దక్కనుంది. ఇదే సమయంలో తెలంగాణ..తమిళనాడు కు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు బోర్డులో అవకాశం కల్పించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి ఛాన్స్ దక్కింది. అదే విధంగా ఎన్నికల్లో ఓడిన వారికి జగన్ అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సాయంత్రానికి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
టిటిడి పాలక మండలి కి జగన్ గ్రీన్ సిగ్నల్..
ముఖ్యమంత్రి జగన్ టీటీడీ పాలక మండలి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మందిగా ఉన్న బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్ తో బోర్డు తుది జాబితా పైన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పేర్లను ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏపీతో పాటుగా తెలంగాణ..కర్నాటక..మహారాష్ట్ర..తమిళనాడు నుండి ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన సుబ్బారెడ్డితో సహా పార్టీ ప్రముఖులతో చర్చించారు. అందులో తనకు ఈ నాలుగు ప్రాంతాల ముఖ్యమంత్రుల నుండి కొన్ని పేర్లు సిఫార్సు చేసారని ముఖ్యమంత్రి వివరించారు. దీంతో..వారిలో వివాదాలకు తావు లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ..తుది జాబితాలో పేర్లు ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా ఖరారు చేసిన సమయంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా మతం పైన ప్రచారం చేసారు. ఇప్పుడు అటువంటి అవకాశాలు ఉండటంతో.. జాగ్రత్తగా సభ్యుల పేర్ల పైన ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
25 మందితో టిటిడి పాలక మండలి.
గతంలో 19 మందితో ఉండే పాలక మండలి సభ్యులను 25 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సాయంత్రానికి అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జాబితాలో విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నాబు..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ఖరారు చేసారు. ఎస్సీ ఎమ్మెల్యే కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పేరు ఖరారైంది. స్థానిక ఎమ్మెల్యే కోటాలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి అవకాశం కల్పించారు. ఆయన గతంలో బోర్డు ఛైర్మన్ గా పని చేసారు. ఇప్పటికే తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సీఎం ఖరారు చేసారు. ఇక, తమిళనాడు నుండి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ పేరు ఖాయమైంది. ఆయన గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. తెలంగాణ నుండి మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు పేరును జగన్ ఖరారు చేసారు. అదే విధంగా ప్రముఖ సినీ దర్శకుడు దిల్ రాజు పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక, మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి..అదే విధంగా తూర్పు గోదావరి నుండి తోట వాణీ పేర్లు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక, సభ్యులుగా సుబ్బారావు, కృష్ణ మూర్తి పేర్లు జగన్ ఖరారు చేసారు.
ముఖ్యమంత్రుల నుండి ఒత్తిళ్లు..
టిటిడి సభ్యులుగా పలువురి పేర్లను కేంద్ర మంత్రుల తో పాటుగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు సిఫార్సు చేసారు. అదే విధంగా ఇద్దరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సైతం ఇద్దరి పేర్లను ముఖ్యమంత్రికి సూచించగా..సీఎం జగన్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. ఏపీలోని మూడు ప్రాంతాల నుండి సభ్యులకు అవకాశం ఇచ్చేందుకే టీటీడీ లో ఇప్పటి వరకు ఉన్న 19 మంది సభ్యుల సంఖ్యను 25 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా మహిళలు..ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రముఖులకు సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఈ సాయంత్రానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి.