జగన్ పంతానికి తోడైన కొడాలి కామెంట్స్- ముదిరిన డిక్లరేషన్ వివాదం..విపక్షాలకు ఆయుధంగా
తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్తులకు డిక్లరేషన్ ఎప్పటి నుంచో ఉన్నదే. గతంలో పలువురు వీఐపీల దర్శనాల సందర్భంగా ఈ అంశం అప్పుడప్పుడూ తెరపైకి వచ్చినా ఎప్పుడూ వివాదంగా మారలేదు. కానీ వైఎస్ జగన్ విషయంలోనే ఇది ఎందుకు వివాదంగా మారుతోంది ? డిక్లరేషన్పై జగన్ ఇప్పటివరకూ ఎక్కడా బహిరంగంగా మాట్లాడింది లేదు. కేవలం వైసీపీ నేతలు, మంత్రులే మా సీఎంకు డిక్లరేషన్ అవసరమా అనే చర్చను లేవనెత్తారు. విపక్షాల విమర్శలు సహజమే అయినా దానికి కొనసాగింపుగా వైసీపీ ఇచ్చిన కౌంటర్ బూమరాంగ్ అయినట్లే కనిపిస్తోంది. జగన్ డిక్లరేషన్తో పాటు ఆయన సతీసమేతంగా ఎందుకు దర్శనం చేసుకోవడం లేదనే మరో కొత్త అంశాన్ని సైతం విపక్షాలు తెరపైకి తెస్తున్నాయి.
సీఎం జగన్ తిరుమల పర్యటన .. నేడే శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ.. బీజేపీ, టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
తిరుమల డిక్లరేషన్ చర్చ...
తిరుమలలో బ్రిటీష్ కాలం నుంచీ అన్యమతస్తులకు డిక్లరేషన్ తప్పనిసరిగా ఉంటూ వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు తమకు విశ్వాసం ఉందంటూ ఓ డిక్లరేషన్ ఇచ్చి దర్శనాలు చేసుకోవడం గతంలో ఎన్నోసార్లు జరిగిందే. కానీ తాజాగా వైఎస్ జగన్ విషయంలోనే డిక్లరేషన్ ఇంత వివాదంగా ఎందుకు మారిందనే చర్చ పెరుగుతోంది. తాజాగా ఏపీలో జరుగుతున్న పలు ఘటనల నేపథ్యంలో తిరుమల డిక్లరేషన్ అంశాన్ని విపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేకపోయినా ప్రభుత్వం తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సీఎం జగన్ డిక్లరేషన్ విషయంలో వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలు వివాదాన్ని పెద్దది చేసినట్లు కనిపిస్తోంది.
. డిక్లరేషన్పై జగన్ పంతం..
వాస్తవానికి స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ గతంలోనూ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చినా ఆయన లెక్కచేయలేదు సరికదా మరోసారి డిక్లరేషన్ లేకుండానే మరో దర్శనానికి సిద్దమవుతున్నారు. గతంలో జగన్ గత ఎన్నికలకు ముందునుంచే హైందవ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో పాల్గొనడం ద్వారా ప్రజల్లో ఓ మెసేజ్ కూడా పంపగలిగారు. అలాంటిది ఇప్పుడు డిక్లరేషన్ విషయంలో పంతానికి పోవాల్సిన అవసరం లేదు. అయినా జగన్ డిక్లరేషన్ విషయంలో విమర్శలకు అవకాశం ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. విపక్షాలు ఎంతగా తనను టార్గెట్ చేస్తే జగన్ అంత మొండిగా నిలబడేందుకు ప్రయత్నిస్తారనేది ఆయన గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట. అందుకు తగినట్లుగానే ఎక్కడా దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా జగన్ మౌనంగా తన పని తాను చేసుకెళ్లిపోతున్నారు.
కొడాలి కామెంట్స్ చిచ్చు..
విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పేరు చెబితే అంతెత్తున లేచే మంత్రి కొడాలి నాని.. అనూహ్యంగా తిరుమల డిక్లరేషన్ విషయంలో కీలకంగా మారిపోయారు. తమ ముఖ్యమంత్రి జగన్ను రాజధాని అమరావతి నుంచి తరలించే విషయంలో వెనకేసుకొస్తున్న కొడాలి నాని, మరోసారి డిక్లరేషన్ విషయంలో యథాలాపంగా విమర్శలకు దిగారు. కానీ వాటికి బీజేపీ, టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యే సరికి వాటి తీవ్రత మరింత పెంచుకుంటూ పోయారు. చివరికి నిన్న కూడా డిక్లరేషన్ ఎత్తేయాలని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని కొడాలి తేల్చేశారు. ఆయన వ్యాఖ్యలతో జగన్కు ప్రత్యేకంగా జరిగిన మేలేమీ లేకపోగా.. ఈ వ్యవహారంలో ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని తన సహజశైలిలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ వివాదం ఇంత ముదిరిందనే వాదన కూడా వినిపిస్తోంది. జగన్ మౌనంగా ఉన్నప్పటికీ కొడాలి వ్యాఖ్యలతోనే విపక్షాలకు ఓ అస్త్రం దొరికినట్లయింది.
Recommended Video
విపక్షాలకు ఆయుధం...
తిరుమల డిక్లరేషన్ విషయంలో జగనే కాదు విపక్షాలు కూడా అంతగా సీరియస్గా తీసుకోలేదు. గతంలో విపక్ష నేతగా ఉండగా, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో జగన్ తిరుమల వెళ్లారు. అప్పట్లో బీజేపీ ఇంత యాక్టివ్గా లేదు. దీంతో టీడీపీ కూడా జగన్ లక్ష్యంగా కేవలం సోషల్ మీడియా వార్కే పరిమితమైంది. కానీ ఇప్పుడు అలా కాదు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలతో పరిస్ధితులు హాట్ హాట్గా ఉన్న తరుణంలో జగన్ తిరుమల దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో జగన్ను టార్గెట్ చేసేందుకు ఇంతకన్నా మంచి సమయం దొరకదని విపక్షాలు భావిస్తున్నాయి. అందుకే తిరుమల డిక్లరేషన్ వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇది ఇప్పటికే మతపరమైన అజెండాతో ముందుకెళ్తున్న బీజేపీకి బాగా కలిసివచ్చే అంశం. అటు బీజేపీ బాటలోనే సాగుతున్న టీడీపీ కూడా ఇకపై దీన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే అవకాశాలున్నాయి.