శ్రీవారి సేవలో వైఎస్ జగన్ - సాష్ఠాంగ నమస్కారం
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమలగిరులు భక్తజన సంద్రం అయ్యాయి. వేలాదిమంది భక్తులు తిరుమలకు పోటెత్తారు. తొలిరోజు పెదశేషవాహనం మీద శ్రీవారు ఊరేగారు. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దీనికి అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు.
శ్రీవారికి దర్శనాన్ని కల్పించే విషయంలో టీటీడీ అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేశారు. సర్వదర్శనాలకు మాత్రమే అనుమతిస్తోన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.
రాత్రి అక్కడే బస చేశారు. ఈ తెల్లవారు జామున మరోసారి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద జగన్ సాష్ఠాంగ నమస్కారం చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వైఎస్ జగన్కు ఆశీర్వచనాలు పలికారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ సమయంలో ఆయన వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు, మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతరం కొత్తగా నిర్మించిన పరకామణి మహా మండపాన్ని ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకుంది. సుమారు 22 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ అధికారులు ఈ మండపాన్ని నిర్మించారు. భక్తులు సమర్పించిన కానుకలను భద్ర పరచడానికి స్ట్రాంగ్ రూమ్, నాణేలను వేరు చేయడానికి ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మిషన్ విలువ రెండున్నర కోట్ల రూపాయలు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్తగా నిర్మించిన అతిథి భవనాన్ని ప్రారంభించారు.