సైనికులకు వందనం.. పురస్కార గ్రహితలకు నజారానా: సీఎం జగన్ ప్రకటన
భారత సైన్యానికి వందనం అని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎండ, చలి, వర్షాన్ని లెక్కచేయక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే.. అది మన సైన్యం గొప్పతనమని గుర్తుచేశారు. మృత్యుభయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని అభినందించారు. వీర పురస్కారాలు పొందేవారికి ఏపీ ప్రభుత్వం తరఫున భారీ నజరానా జగన్ ప్రకటించారు.
సైనికులకు వందనం..
135 కోట్ల మందిని పరిరక్షిస్తున్న వీర సైనికులకు వందనం అని కొనియాడారు జగన్. తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన స్వర్నిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. సైనికుల త్యాగాలు మరువలేనివని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. పరమవీరచక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.కోటి, మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కారాలకు రూ.80 లక్షలు, వీరచక్ర, శౌర్యచక్ర పురస్కారాలకు రూ.60 లక్షలు ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
సైనికులకు సన్మానం..
1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధంలో సేవలందించిన మహావీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధవీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి వేణుగోపాల్ను సీఎం జగన్ సత్కరించారు. అనారోగ్యానికి గురవడంతో సీఎం జగన్ నేరుగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఘనంగా సన్మానించారు. పరేడ్ మైదానంలో మరికొంత మంది సైనికులకు సీఎం జగన్ సన్మానించారు.
స్వప్నిమ్ విజయ్ వర్ష్
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్వప్నిమ్ విజయ్ వర్ష్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద వెలిగించిన విజయ జ్వాల బుధవారం తిరుపతి చేరుకుంది. 20వ తేదీ వరకు తిరుపతిలోనే ఈ జ్వాలకు ఆతిథ్యం ఇస్తున్నారు.