అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము
తిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో శనివారం దాదాపు ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించింది. అటువైపు వెళుతున్న భక్తులు ఆ పామును చూసిన తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
ఇక దుకాణంలోకి పాము దూరిన విషయాన్ని గమనించిన యజమాని.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు.
భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పిన భాస్కర్.. ఆ పామును ఎంతో చాకచక్యంతో పట్టుకున్నాడు. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా అడవిలో వదిలిపెట్టారు. దీంతో ఆ దుకాణం యజమానితోపాటు అక్కడున్న భక్తులంతా ఊపిరిపీల్చుకున్నారు.
సాధారణంగా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఇలాంటి పాములు చాలానే తిరుగుతుంటాయి. అప్పుడప్పుడూ ఇలా భక్తులకు తారసపడుతుంటాయి. కానీ, ఇప్పటి వరకు అడవిలోని జంతువులు కానీ, ఇలాంటి పాములు కానీ భక్తులకు ఎలాంటి హానీ తలపెట్టకపోవడం గమనార్హం.
హనుమంత వాహనంపై శ్రీవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామి వారికి హనుమంత వాహనసేవ జరిగింది. హనుమంతుడి భుజస్కంధాలపై స్వామివారు రామావతారంలో కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు.
వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిప్రపత్తులను చాటుకున్నారు. సాయంత్రం స్వామివారి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. మహిళా భక్తులు స్వర్ణరథాన్ని లాగగా.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో ఊరేగారు. ఇక శనివారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ జరిగింది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తరించారు.