నిర్మానుష్యంగా తిరుమల గిరులు: కలియుగ వైకుంఠాన్ని ఇంకెప్పుడూ ఇలా చూడలేమేమో..!
తిరుపతి: కరోనా మహమ్మారి పుణ్యాన కలియుగ వైకుంఠం బోసిపోయింది. 24 గంటలపాటు గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోవాల్సిన తిరుమల గిరులు నిశ్శబ్దంగా మారిపోయాయి. వేలాది మంది భక్తులతో కిటకిటలాడాల్సిన శ్రీవారి ఆలయం నిర్మానుష్యంగా మారింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కళకళలాడాల్సిన శ్రీనివాసుడి స్వర్గధామం వెలవెలబోయింది. అసలు మనం చూస్తున్నది తిరుమలేనా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
కరోనా వైరస్ వల్ల ముందు జాగ్రత్తచర్యగా..
ప్రాణాంతక కరోనా వైరస్ను వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం.. ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా ఉండటానికి భక్తుల కోసం శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసినట్లు టీటీడీ వెల్లడించిన విషయం తెలిసిందే. స్వామివారికి రోజువారీ సేవలన్నీ సజావుగా సాగుతున్నాయని ప్రకటించింది. సుప్రభాత సేవ మొదలుకుని అన్ని రకాల రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
ఆలయ సిబ్బంది.. కొద్దిమంది భక్తులు మినహా..
గతంలో ఎప్పుడూ లేనివిధంగా తిరుమల ఆలయంలోనికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన ప్రభావం ఎలా ఉంటుందనేది అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. శ్రీవారి ఆలయ సమీపంలో గానీ, తిరుమాడా వీధుల్లో గానీ భక్తులెవరూ లేరు. వారందర్నీ ఇదివరకే ఖాళీ చేయించారు టీటీడీ సిబ్బంది. కొత్తగా మరెవరూ కొండపైకి రానివ్వకుండా అలిపిరి వద్ద టోల్గేట్ను గురువారం మధ్యాహ్నానికే మూసివేశారు. తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్డును మూతపడటం వల్ల కొత్తగా ఎవ్వరూ కొండమీదకి చేరుకోలేదు. ప్రస్తుతం కొండ మీద కొద్దిమంది భక్తులు, ఆలయ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు.
దుకాణాలు మూత..
రోజూ వేలాదిమంది భక్తులతో కిటకిటలాడాల్సిన తిరుమలలో నామమాత్రంగా కూడా భక్తులు ఎవరూ లేకపోవడం వల్ల అక్కడి దుకాణాలు కూడా తెరచుకోలేదు. వసతి గృహాలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. ఉన్న కొద్దిమంది భక్తులు కూడా గురువారం సాయంత్రానికి తమ గదులను ఖాళీ చేయనున్నారు. టోల్గేట్ను మూసివేయడం వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. తిరుమలలో నివాసం ఉంటున్న అర్చకులు, వారి కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బందికి అవసరమైన నిత్యావసర సరుకులను తరలించడానికి మాత్రమే పరిమితంగా వాహనాలను అనుమతిస్తున్నారు.
Recommended Video
ఎన్నిరోజులు ఇలా..
శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచీ వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటు ఉంటారు. వారిలో ఎవరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో తెలియదు. అందుకే- ఏ భక్తుడిని కూడా స్వామివారి దర్శనాన్ని కల్పించట్లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్తుల్లో వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం కష్టతరమని అంటున్నారు. అందుకే కఠినమే అయినప్పటికీ.. భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపివేయక తప్పలేదని స్పష్టం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు నిరాశతో తిరుగుముఖం పడుతున్నారు.