క్రైస్తవుడంటూ విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించిన ఏపీ డీజీపీ
తిరుపతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా మతం ప్రస్తావన జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలకు మతం కేంద్రబిందువైంది. మతం చుట్టే అన్ని పార్టీల రాజకీయాలు తిరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలు ఈ తరహా ప్రచార పర్వానికి కారణం అయ్యాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నిర్వహించబోతోండటం కూడా మత రాజకీయాలకు మరింత ఆజ్యం పోసినట్టయిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
కేసీఆర్కు ఏమైంది?: యశోదా ఆసుపత్రిలో చేరిక: అనారోగ్యానికి కారణం ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా అత్యున్నత పదవుల్లో ఉన్న అధికారులను కూడా వదలట్లేదు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలు. వైఎస్ జగన్, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఈ ముగ్గురూ క్రైస్తవులేనని, అలాంటి వారి సారథ్యంలో హిందూ దేవాలయాలపై కొనసాగుతోన్న దాడులకు సంబంధించిన దర్యాప్తు సమగ్రంగా ఉండబోదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ముగ్గురినీ క్రైస్తవులుగా పేర్కొనడం.. మత రాజకీయాలు పతాక స్థాయికి చేరినట్టయింది. ఈ పరిణామాల మధ్య గౌతమ్ సవాంగ్.. తిరుమలకు వెళ్లారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారు జామున ఆయన వీఐపీ బ్రేక్ దర్శన్ సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇగ్నైట్ పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనడానికి గౌతమ్ సవాంగ్ తిరుపతికి వచ్చారు.
తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డితో కలిసి ఆయన తిరుమలకు వెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం ముగించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు శాలువను కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. తిరుమల భద్రతా ఏర్పాట్ల గురించి గౌతమ్ సవాంగ్.. అడిగి తెలుసుకున్నారు.