తిరుమల శ్రీవారి బంగారునిల్వలు ఎన్ని టన్నులంటే .. ఒక చిన్న దేశంలో ఉండే బంగారునిల్వలంత
వడ్డీ కాసుల వాడు వేంకటేశుడు .. ఏడుకొండలవాడు .. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే , ఆయన వైభోగం చూస్తే చాలు . ఆయన వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒకచిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు నిల్వలు స్వామివారి వద్ద ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
నేడు, రేపు వడగాల్పులు..! గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!
స్వామి వారికి నిత్యం భక్తుల బంగారు కానుకలు
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది . నిత్యం దేశ విదేశాల నుండి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారం అయితే లెక్క లేనంత స్వామి వారి ఖాజానా కు చేరుతుంది . ప్రతీ సంవత్సరం కోట్ల సంఖ్యలో స్వామిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటున్నారు. చాలా విలువైన, అపురూపమైన ఆభరణాలు స్వామి వారి సొంతం .
బ్యాంకుల్లో ఉన్న బంగారు నిల్వలు 9,259 కేజీలు
టీటీడీకి సంబంధించిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం స్వామివారి వద్ద టన్నుల కొద్దీ బంగారు నిల్వలు ఉన్నాయి.మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉంది. స్వామి వారి పేరు మీద బ్యాంకుల్లో 9,259 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయంటే ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం చేసుకోవచ్చు. . ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపడం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావటం కూడా పెద్ద వివాదంగా మారింది. తిరిగి అంతా క్లియర్ గానే ఉందని తేలింది.
స్వామి వారి మొత్తం ఆభరణాలు, బంగారు నిల్వలు 11టన్నులు
దేశంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం స్వామి వారికి నిత్యం అలంకరించే ఆభరణాలతో కలిపితే 11 టన్నుల బంగారం ఉన్నట్టు అంచనా . నిత్యం బంగారు, వెండి, వజ్ర, వైఢూర్యాలతో కూడిన ఆభరణాలు భక్తులు స్వామివారికి సమర్పిస్తుంటారు. ప్రస్తుతం ఆలయంలోని మూల మూర్తి అలంకరణకు 120 రకాల ఆభరణాలు, ఉత్సవ మూర్తుల అలంకరణకు 383 రకాల ఆభరణాలు వాడుతున్నారు. శ్రీవారికి 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో 7 కిరీటాలు ఉన్నట్టు పాత లెక్కలు చెబుతున్నాయి. బ్యాంకుల్లో ఉన్న బంగారు నిల్వలు , స్వామి సేవకు వినియోగించే ఆభరణాలు అన్నీ కలిపి ఒక చిన్న దేశం బంగారం నిల్వలతో సమానం అంటే స్వామి వారి సంపద అర్ధం అవుతుంది.