Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !
తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూంది పోటు సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనం
తిరుమల శ్రీవారి ఆలయం వెలుపలు ఉంటుంది ఈ బూంది పోటు. మధ్యాహ్నం బూంది తయారు చేస్తున్న సమయంలో తొలుత నల్లగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీనితో- ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బూంది పోటు సిబ్బంది బయటికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైరింజన్లతో బూంది పోటు వద్దకు చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనతో లడ్డూ తయారీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
పోటులోని పైకప్పులు, గోడలకు అంటుకున్న నెయ్యి జిడ్డు వల్ల మంటలు అంటుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిజానికి- ఈ తరహా ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రతి నెలా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో పోటులో మాస్ క్లినింగ్ నిర్వహిస్తారు. ఈ సారి కూడా కిందటి అమావాస్య రోజు నాడు మాస్ క్లీనింగ్ చేపట్టారు. అయినప్పటికీ- బూంది తయారీ ఇదివరకు కంటే అధికంగా ఉండటం వల్ల నెయ్యి జిడ్డు పెద్ద ఎత్తున గోడలకు అంటుకుని ఉంటుందని భావిస్తున్నారు.
దీనితోపాటు నెయ్యి ఆవిరిగా మారి, ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి అవకాశం ఉంటుందని అంటున్నారుు టీటీడీ అధికారులు. మంటలను అదుపు చేసిన తరువాతే..ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడిస్తామని చెబుతున్నారు. వందలాది భక్తులు లడ్డు విక్రయ కౌంటర్ల వద్ద తిరుగాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. లడ్డు కౌంటర్లను ఖాళీ చేశారు. ఇదివరుకు చాలాసార్లు బూంది పోటులో మంటలు చెలరేగాయి. గత ఏడాది మార్చిలో చివరిసారిగా బుంది పోటీలు అగ్ని ప్రమాదం సంభవించింది.