తిరుమలలో అపూర్వ ఘట్టం: యాగం ముగిసిన కొద్దిసేపటికే..!
తిరుపతి: కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆరంభించిన కారీరిష్ఠి యాగం తొలిరోజే కొన్ని గంటల వ్యవధిలోనే సత్ఫలితాలను ఇచ్చింది. యాగం ఆరంభమైన కొద్దిసేపటికే వరుణుడు కరుణించాడు. తిరుమల, తిరుపతిలో వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో తిరుమల తడిచి ముద్దయింది.
వరుణదేవుడి అనుగ్రహం కోసం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సదుద్దేశంతో టీటీడీ కారీరిష్టి, వరుణజప, పర్జన్య శాంతి యాగాలను మంగళవారం చేపట్టింది. తిరుమలలో పాపవినాశనాకి వేళ్లే మార్గంలోని పారవేట మండపం సమీపంలోని గోగర్భ తీర్థంలో ఈ యాగాన్ని 10 మంది రుత్విక్కులు వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. రుత్విక్కులను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పిలిపించారు. ఈ యాగానికి తమిళనాడులోని కుంభకోణానికి చెందిన ప్రముఖ రుత్విక్ లక్ష్మీ వెంకటరమణ దీక్షితర్ నేతృలో ఈ యాగాలు అయిదురోజుల పాటు కొనసాగుతాయి. ఈ నెల 18వ తేదీ వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
తొలిరోజు యాగాన్ని గణపతి పూజతో ఆరంభించారు. దీనికి టీటీడీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్, ఆయన సతీమణి జయా సింఘాల్ హాజరయ్యారు. మహాసంకల్పం చెప్పారు. వరుణ దేవుడి కరుణా కటాక్షాల కోసం కారీరిష్టి, వరుణజపం, రుష్యశృంగ శ్లోకం, విరాటపర్వ పారాయణం, అమృతవర్షిణి వంటి అయిదు ప్రధాన క్రతువులను నిర్వహిస్తున్నట్టు సింఘాల్ తెలిపారు.
నల్లటి గుర్రం, పొట్టేలు అనుమతి తీసుకుని యాగం ఆరంభం..
సాధారణంగా యజ్ఞయాగాదుల్లో రుత్వికులు శ్వేత వర్ణ దుస్తులు ప్రాధాన్యత ఇస్తారు. నల్లటి వస్త్రాలను ధరించరు. కారీరిష్టి యాగంలో పాల్గొనే వైదికులు నల్లని వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. అది యాగ నియమం. నల్లటి మేఘాలను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ ఆచారం. యజ్ఞంలో ఉపయోగించే బియ్యం, తేనె, గుర్రం, పొట్టేలు నల్లరంగులోనే ఉంటాయి. ప్రతిరోజు ఈ జంతువులను యజ్ఞగుండం అభిముఖంగా ప్రవేశపెట్టి అవి తలలు ఊపిన తరువాత కార్యక్రమం ప్రారంభిస్తారు. అవి తలలు ఊపి తమ యాగ నిర్వహణకు తమ అనుమతిని తెలియజేస్తాయని రుత్విక్కులు అభిప్రాయపడుతున్నారు.
2017 తరువాత మరోసారి..
యాగం ముగిసిన అనంతరం సింఘాల్ విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల కిందట కారీరిష్టి యాగాన్ని నిర్వహించామని, ఫలితంగా ఆ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయని చెప్పారు. తిరుమల ప్రధాన నీటి వనరు గోగర్భం జలాశయంలో నీరు సమృద్ధిగా చేరిందని చెప్పారు. గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార, పసుపుధార, తుంబురతీర్థాలలో వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉంటుందని అన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 67 ప్రధాన నీటి వనరులైన కృష్ణా, గోదావరి, వంశధార, మూసి, గుండ్లకమ్మ, బహుదా, వేదవతి, కళ్యాణి, హంద్రీనీవా, కొల్లెరు సరస్సు, చిత్రావతి ఇతర నదులలో నీరు చేరి ప్రజలు పాడిపంటలతో సుభిక్షంగా ఉంటారన్నారు.