టీటీడీ కిరీటాల మాయం ఇంటి దొంగల పనేనా? సీసీ కెమెరా లేదా?
తిరుపతి : ఏడుకొండలవాడు కొలువుదీరిన తిరుపతిలో మరోసారి దొంగలు పడ్డారు. గోవిందరాజ స్వామి ఆలయంలో 3 స్వర్ణ కిరీటాలు మాయమైన ఘటన దుమారం రేపుతోంది. కోదండరాముడి ఆలయంలో జరిగిన ఆభరణాల గోల్మాల్ మరవకముందే.. తాజాగా 50 లక్షల విలువచేసే కిరీటాలు మాయం కావడం చర్చానీయాంశంగా మారింది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కిరీటాలు మాయమైన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు.
స్వర్ణ కిరీటాలు మాయం
తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఉత్సవ మూర్తులకు సంబంధించిన 3 స్వర్ణ కిరీటాలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. శనివారం సాయంత్రం వెలుగుచూసిన ఘటనపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామికి చెందిన 3 స్వర్ణ కిరీటాల బరువు 1351 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల రూపాయల విలువజేసే కిరీటాలు ఎవరు దొంగిలించారనేది సస్పెన్స్ గా మారింది. సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా, సీసీ కెమెరాల కళ్లుగప్పి ఎలా ఎత్తుకెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది.
సీసీ కెమెరా లేదా?
కోదండరామస్వామి ఆలయంలో జరిగిన ఆభరణాల గోల్మాల్ మరవకముందే.. తాజాగా గోవిందరాజ స్వామి ఆలయంలో.. 3 స్వర్ణ కిరీటాలు చోరీకి గురికావడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే కిరీటాలు దొంగిలించిన కల్యాణమండపంలో సీసీ టీవి కెమెరా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదివరకు అక్కడ సీసీ కెమెరా ఉన్నా.. అది పనిచేయకపోవడంతో దాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. దాంతో నిందితులెవరనేది గుర్తించడం కష్టంగా మారింది. ఆలయ ప్రాంగణంలో 12 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది.
ఇంటి దొంగలేనా?.. దర్యాప్తు ముమ్మరం
మూడు స్వర్ణ కిరీటాలు మాయమైన ఘటనపై పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు వేగవంతం చేశారు. గోవిందరాజ స్వామి ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆ మేరకు కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇంటి దొంగలే కిరీటాలు మాయం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కిరీటాలు చోరీ జరిగిన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి నగలకు భద్రత లేకుండా పోయిందంటూ ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దేవస్థానానికి సంబందించిన ఆలయాల దగ్గర భద్రత పెంచాలని కోరారు.