సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే .. ప్రతిపక్షాల డిమాండ్ .. చిత్తూరు జిల్లాలో హై అలెర్ట్
ఏపీలో ఆలయాలపై దాడులు జరగడం, దేవుళ్ళ విగ్రహాల ధ్వంసం ఘటనలతో పాటుగా తాజాగా తిరుమల డిక్లరేషన్ వివాదం రచ్చగా మారుతోంది. ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో హిందూ సంఘాలు, బిజెపి నాయకులు డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతనే సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయంలో కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పట్టు వస్త్రాలను సతీ సమేతంగా స్వామివారికి సమర్పించాలని కూడా పేర్కొంటున్నారు.
తిరుమల కొండతో పెట్టుకుంటే బూడిదే .. కొడాలి నానీ వ్యాఖ్యలపై పరిపూర్ణానంద ఫైర్
సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ .. అడుగడుగునా పోలీసుల భద్రత
వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. బిజెపి, టిడిపి నేతలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిందూ ధార్మిక సంఘాలు సైతం ఆందోళనలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరసనలను అణచివేస్తున్నారు పోలీసులు .భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు హౌస్ అరెస్టులతో పాటుగా, ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
డిక్లరేషన్ ఇవ్వటానికి భయం దేనికని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు
మరోవైపు హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద సీఎం జగన్ ఇంటి దగ్గర కూడా బిజెపి , భజరంగ్ దళ్ నేతల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కచ్చితంగా జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నారు బీజేపీ నేతలు . సంతకం పెట్టడం ఇష్టం లేకపోతే తిరుమల వెళ్లడం దేనికీ అంటూ టిడిపి నేతలు మండిపడుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి భయమెందుకని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. హిందూ ఆచారం మేరకు దర్శించుకోవడానికి జగన్ కు ఉన్న ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు .ఆలయ ఆచారాలను ధిక్కరించడం సీఎం జగన్మోహన్ రెడ్డికి భావ్యం కాదని పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎదురు దాడి... చిత్తూరు జిల్లాలో హై అలెర్ట్
అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ పరిపూర్ణానందస్వామి వ్యాఖ్యానించారు. అయితే గతంలో జగన్ తిరుమల కి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని ప్రశ్నించని వారు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ అధికార పార్టీ ఎదురు దాడికి దిగుతుంది. డిక్లరేషన్ పై సంతకం పెట్టాలని ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు, డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిన అవసరమే లేదని అధికార పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా నేడు తిరుమలకు సీఎం వైయస్ జగన్ వెళ్ళనుండడం ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించి , ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నారు.