వేయికాళ్ల మండపం నిర్మాణానికి వేయి అడ్డంకులు
తిరుపతిః పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అభివృద్ధి పేరుతో కోల్పోయిన అపురూప కట్టడం వేయి కాళ్ల మండపం. దీని పునర్నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవహారం న్యాయస్థానంలో నలుగుతోంది. కూల్చివేసిన ప్రదేశంలోనే వేయి కాళ్ల మండపాన్ని పునర్నించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనలను చేపట్టింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం వాదోపవాదాలను విన్నది.
700 సంవత్సరాల ఘన చరిత్ర..
భక్తుల వసతి కోసం సుమారు 700 సంవత్సరాల కిందటే వేయికాళ్ల మండపాన్ని నిర్మించారు అప్పటి పాలకులు. తిరుమల అభివృద్ధిలో భాగంగా 2003లో అప్పటి ప్రభుత్వం..ఈ మండపాన్ని కూల్చివేసింది. తిరుమల అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ప్లాన్ లో భాగంగా ఆ చారిత్రక కట్టడాన్ని తొలగించారు.అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగినప్పటికీ ఖాతరు చేయలేదు. మండపం తొలగింపుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మండపాన్ని ఉన్న స్థానంలోనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్యమమే నడిపించారు. పడగొట్టిన వేయికాళ్ల మండపం స్థానంలోనే కొత్త మండపం నిర్మించాలని పట్టుబట్టారు. భక్తులు కొందరు కోర్టును ఆశ్రయించారు.
అప్పట్లో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. వేయికాళ్ల మండపం స్థానంలోనే మరో కొత్త మండపాన్ని నిర్మించాలని 2007లో హైకోర్టు టీటీడీని ఆదేశించింది. అప్పటి టీటీడీ బోర్డు ఇందుకు పూనుకొంది. మహామణి మండపం పేరుతో 200 అడుగుల వెడల్పు 100 అడుగుల పొడవుతో మండపాన్ని నిర్మించాలని 2007లో అప్పటి ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి ఆమోదించింది కూడా. దీనికోసం 2007 డిసెంబరు 6వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ముందుకు సాగని పనులు..
అప్పటి నుంచి పనులు ముందుకు సాగలేదు. భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండలి కాల వ్యవధి తీరిపోయింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల పనులు ప్రారంభం కాలేదు. డీకే ఆదికేశవులు నాయుడు ఛైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి పాలక మండలి ఈ మండపాన్ని వేరే ప్రదేశంలో నిర్మిస్తామని ప్రకటించింది. ఆ పనులు కూడా ముందుకు సాగలేదు. అమలుకు నోచుకోలేదు. డీకే ఆదికేశవులు నాయుడు అధ్యక్షతన ఏర్పాటైన పాలకమండలి కూడా కాల వ్యవధి ముగిసింది.
న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ..
ఆ తరువాత ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ మహామణి మండపం నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 17 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ఆగమేఘాలపై మొదలుపెట్టింది. పురాతన మండపాన్ని కూల్చడం, తిరిగి మరో పేరుతో కొ త్త మండపం నిర్మించడంపై విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టు ను ఆశ్రయించారు. ఆయన వేసిన పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. టీటీడీ ఈవోతో పాటు పనులకు ఆమోదం తెలిపిన శ్రీవారి ఆలయ పెద జీయర్కు కోర్టు నోటీసులు ఇచ్చింది.
ప్రధాన ఆలయ వద్దే కట్టాలి
అనంతరం మహామణి మండపాన్ని నారాయణగిరి ప్రాంతం వద్ద నిర్మించడానికి 2015లో అప్పటి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మండపాన్ని తరలించకూడదని, పాత స్థలంలోనే దీన్ని పునర్నిర్మించాలని కోరుతూ రోజా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనలను విన్నది. వేయికాళ్ల మండపాన్ని స్వామి వారి ప్రధాన ఆలయం ఎదుటే నిర్మించాల్సిన అవసరం ఉందని న్యాయవాది టీకే శ్రీధర్ వాదించారు. భద్రతా కారణాలను చూపుతూ దీన్ని నారాయణగిరిలో నిర్మించడానికి టీటీడీ చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పురాతన కట్టడాలను అనుమతి లేకుండా కూల్చివేయడం నేరమని, దాన్ని ఉన్న చోటే పునర్నిర్మించాలని చెప్పారు.
నిర్మాణం ఇప్పట్లో అసాధ్యమా?
ఇలా వేయి కాళ్ల మండపం నిర్మాణ పనులు మొత్తం న్యాయస్థానం చుట్టే తిరుగుతోంది. 2013లో ఆ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినప్పటి నుంచీ ఇదే పరిస్థితి . పనుల్లో నెలకొన్న తీవ్ర జాప్యం.. పెను ప్రభావాన్ని చూపుతోంది. వేయి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించడం వల్ల భక్తులకు నివాస వసతి పూర్తిగా తీరిపోతోంది. చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ కూడా స్వామివారిని దర్శించడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఇప్పటికే పలు అతిథి గృహాలు ఉన్నప్పటికీ అవి ఎంత మాత్రమూ చాలట్లేదు. వేయి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించిన అనంతరం దాన్ని ఏ రకంగా వినియోగంలోకి తీసుకొస్తారనేది తెలియరావాల్సి ఉంది.