తిరుమలలో మరో రిజర్వాయర్: ఎన్టీఆర్ కాలంలో శంకుస్థాపన..వైఎస్ జగన్ హయాంలో కదలిక
తిరుపతి: శేషాచలం అడవుల్లో మరో చిన్న తరహా రిజర్వాయర్ ను నిర్మించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కలియుగం వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల సహా తిరుపతి నగర ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి కొత్తగా ఈ రిజర్వాయర్ ను నిర్మించాలని జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతుండటం, తిరుపతి నగరం శరవేగంగా విస్తరించడం వంటి కారణాల వల్ల దీనికి అనుగుణంగా నీటి లభ్యత లేదు. ఫలితంగా వేసవి సీజన్ లో నీటి ఎద్దడి ఎదురవుతోంది. దీన్ని అధిగమించడానికి కొత్తగా రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
నిరుద్యోగులు సిద్దం కండి..జనవరి 1న కొత్త నోటీఫికేషన్లు: వారందరికీ సెల్యూట్..సీఎం జగన్..!
కపిల తీర్థం పరవళ్లకు అడ్డుకట్ట
శేషాచలం అడవుల నుంచి ప్రవహించే కపిల తీర్థం నదిపై కొత్తగా రిజర్వాయర్ ను నిర్మించాలనేది ఈ ప్రతిపాదన. ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో కపిల తీర్థం పోటెత్తుతోన్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా సహా శేషాచలం అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు కపిల తీర్థం, మాల్వాడి గుండం జలకళను సంతరించుకున్నాయి. ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. కపిల తీర్థానికి ఈ స్థాయిలో ప్రవహించడం తక్కువే. అందుకే- వచ్చిన వరద నీటికి వచ్చినట్టే అడ్డుకట్ట వేయాలని జల వనరుల శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలకు కొత్త రూపాన్ని ఇచ్చారు. రిజర్వాయర్ ను నిర్మించి తిరుమల, తిరుపతి నీటి అవసరాలను తీర్చడానికి కపిల తీర్థం జలాలను మళ్లించాలనే అంశంపై ఓ నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు.
34 సంవత్సరాల కిందటే శంకుస్థాపన
కపిల తీర్థంపై రిజర్వాయర్ ను నిర్మించాలనే నిర్ణయం ఈ నాటిది కాదు. చాలా పాతదే. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో రిజర్వాయర్ ను కట్టాలని భావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీరింగ్ విభాగం రూపొందించిన ఈ ప్రతిపాదనలకు నాటి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన సైతం చేశారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడం వల్ల అప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కపిల తీర్థం ప్రవాహించే ఆల్వార్ తీర్థం చిన్న స్థాయి రిజర్వాయర్ ను నిర్మించాలనేది అప్పటి ప్రభుత్వ ఉద్దేశం.
టెండర్లు పూర్తయినా..
ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన తరువాత రెండేళ్ల కాల వ్యవధిలో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. రిజర్వాయర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) ఎంత ఉండాలనే విషయం కొంత భిన్న వాదనలు వినిపించాయి. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే కొద్దీ బ్యాక్ వాటర్ వల్ల ఇబ్బందులు వస్తాయని అంచనా వేశారు. దీనికితోడు పెద్ద ఎత్తున అటవీ సంపదను కోల్పోవాల్సి రావడం వల్ల దీనికి సంబంధిత శాఖ నుంచి అనుమతులు రాలేదు. ఫలితంగా టెండర్లు రద్దయ్యాయి. ప్రాజెక్టు పనులు అటకెక్కాయి. ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ రిజర్వాయర్ నిర్మాణం ఆలోచన వచ్చినప్పటికీ.. అది అర్ధాంతరంగా ఆగిపోయింది.
తాజా కదలిక..
తాజాగా మరోసారి కపిల తీర్థంపై రిజర్వాయర్ అంశం తెర మీదికి వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చిన నేపథ్యంలో.. ఈ అంశం చర్చకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రిజర్వాయర్ ప్రతిపాదనలను వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధ్యయనం చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.