టీడీపీ హయాంలో టీటీడీ నిధుల మళ్లింపు: కొత్త ప్రభుత్వం తిరగతోడుతుందా?
అమరావతి: ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి తిరుమల. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు స్వామి వారికి హుండీల ద్వారా సమర్పించే కానుకల రూపంలో ప్రతిరోజూ కనీసం కోటి రూపాయలు టీటీడీ ఖజానాకు చేరుతుంటాయి. లడ్డూ విక్రయాలు, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గృహాల కేటాయింపుల రూపంలో వచ్చే ఆదాయం దీనికి అదనం. ఏటా ఎంత లేదన్నా 3000 కోట్ల రూపాయలు టీటీడీకి అందుతుంటాయి. ఈ మొత్తం ఓ చిన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్తో సమానం.
అంతటి ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఆదాయం తెలుగుదేశం పార్టీ హయాంలో దారి మళ్లిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తున్నాయి. ఆడిటింగ్ వ్యవస్థ అంటూ ఏదీ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ నిధులను ప్రభుత్వ, పార్టీ అవసరాలకు మళ్లించుకుంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులు ఈ తరహా విమర్శలు చేస్తున్నారనుకోవడంలో అర్థం ఉంది. కొంతమంది మేధావులు, పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారులు, ఇదివరకు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన వ్యక్తులు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
తిరుమల ఆదాయంపై పకడ్బందీగా ఆడిట్ను నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటూ నిన్నటికి నిన్న తిరుపతి లోక్సభ మాజీ సభ్యుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన ఏకంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు లేఖ రాశారు. ఇదే తరహా డిమాండ్ను గతంలో సుబ్రహ్మణ్యస్వామి కూడా లేవనెత్తిన విషయం తెలిసిందే. పరమ పవిత్రమైన తిరుమల ఆదాయాన్ని తెలుగుదేశం తన రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తోందని, దీనిపై ఆడిట్ చేపట్టాలని అంటూ ఇదివరకు సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఆయన దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ పరిధి నుంచి టీటీడీని తప్పించాలని ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది.
అన్ని వైపుల నుంచి, అన్ని వర్గాల నుంచీ వస్తోన్న ఈ డిమాండ్ను రాబోయే కొత్త ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పడబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ చేసిన దుర్వినియోగం, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిధులు మళ్లింపు అంశాలపై తిరగతోడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
టీటీడీ నిధుల మళ్లింపు వ్యవహారాన్ని తేలిగ్గా వదల కూడదని భావిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో సిద్ధహస్తుడు, నిష్ణాతుడు, నమ్మకస్తుడైన పార్టీ సీనియర్ నాయకుడొకరిని టీటీడీ ఛైర్మన్గా నియమించడం, చిత్తశుద్ధితో పనిచేస్తారనే గుర్తింపు ఉన్న ఐఎఎస్ అధికారిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా నియమించడం వంటి చర్యలను చేపట్టి, టీటీడీ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న నిధుల మళ్లింపు వ్యవహారాన్ని సమీక్షించాలనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సోమవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చింతా మోహన్.. ఆఫ్ ది రికార్డ్గా ఈ విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అంటూ మారటం జరిగితే- టీటీడీకి వచ్చే ఆదాయంపై ఆడిట్ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల నుంచి తనకు సమాచారం అందిందని చింతామోహన్ వెల్లడించినట్లు చెబుతున్నారు. టీటీడీ నిధులపై ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం చాలా ఉందని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి టీడీపీ హయాంలో దుర్వినియోగమైందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయంపై తాను గవర్నర్కు కూడా లేఖ రాశానని అన్నారు.