టీటీడీ ఐఎస్ఓ: ఏకంగా తొమ్మిది అనుబంధ సంస్థలకు అంతర్జాతీయ గుర్తింపు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మరో అరుదైన గుర్తింపును అందుకుంది. రోజూ కనీసం లక్షమంది భక్తులు సందర్శించే తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటించే సంస్థలకు అంతర్జాతీయ నాణ్యాత ప్రమాణాల సంస్థ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్-ఐఎస్ఓ) ప్రత్యేకంగా సర్టిఫికెట్లను అందజేస్తుంది. ఒక్క సర్టిఫికెట్ వస్తేనే, ఎగిరి గంతులేస్తాయి కొన్ని సంస్థలు. అలాంటిది- ఏకంగా తొమ్మిది సర్టిఫికెట్లను అందుకుంది టీటీడీ. టీటీడీ ఆధీనంలో నడిచే తొమ్మిది అనుబంధ సంస్థలకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు లభించాయి.
మరో వివాదంలో ఎన్నికల కమిషన్: సుప్రీంకోర్టును ఆశ్రయించిన తేజ్ బహదూర్
ఆ తొమ్మిది సంస్థలేమిటంటే..?
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని యాత్రికుల వసతి సముదాయాలు, కళ్యాణ మండపాలు, విద్యా సంస్థల్లో అనుసరిస్తోన్న నాణ్యతా ప్రమాణాలకు ఈ గుర్తింపు దక్కింది. తిరుపతిలోని మాధవం యాత్రికుల వసతి భవనం, శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. వాటితో పాటు- చిత్తూరు జిల్లాలోని కుప్పం, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, తెలంగాణలోని మహబూబ్నగర్, బెంగళూరులో నిర్మించిన కల్యాణ మండపాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది.
విష్ణునివాసంతో ఆరంభం..
తిరుపతి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం భక్తుల వసతి సముదాయానికి ఇదివరకే ఐఎస్వో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో విష్ణు నివాసానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ను అందజేశారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ అందుకోవడం టీటీడీ చరిత్రలో అదే తొలిసారి. ఈ రెండు నెలల వ్యవధిలో ఏకంగా తొమ్మిది సంస్థలకు అత్యున్నత ప్రమాణాల గుర్తింపు లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒకేసారి తొమ్మిదింటికి ఐఎస్ఓ గుర్తింపు లభించడం అత్యంత అరుదని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఐఎస్ఓ ప్రతినిధి కార్తికేయన్ నుంచి ఆయన గుర్తింపు సర్టిఫికెట్లను అందుకున్నారు.