తిరుపతిలో దారుణం: జేసీబీతో కరోనా పేషెంట్ మృతదేహాన్ని ఖననం చేసిన వైనం: సస్పెండ్ చేసినా
తిరుపతి: టెంపుల్ టౌన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలోని పలాస తరహాలోనే కరోనా వైరస్ వల్ల మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడానికి జేసీబీని వినియోగించారు స్థానిక అధికారులు. పలాసలో చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకున్నారు. అధికారులను సస్పెండ్ చేశారు.
పలాస ఘటన చోటు చేసుకున్న సరిగ్గా 10 రోజుల వ్యవధిలో అదే తరహా ఉదంతం మళ్లీ సంభవించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రే జోక్యం చేసుకున్నా, అధికారులను సస్పెండ్ చేసినా.. అధికారుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచింది. తిరుపతి రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు కరోనా వైరస్తో బాధపడుతూ కొద్దిరోజుల కిందట రూయా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఆయన మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చారు. అప్పటికే శ్మశానవాటికలో జేసీబీతో గొయ్యి తవ్వించారు. అనంతరం అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని కిందికి దించారు. కొద్దిసేపటి తరువాత దాన్ని జేసీబీ బకెట్లోకి ఎక్కించారు. అంబులెన్స్ దగ్గరి నుంచి గొయ్యి వరకు మృతదేహాన్ని జేసీబీలోనే తరలించారు. దానితోనే మృతదేహాన్ని అందులోకి పడేశారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.10 రోజుల కిందటే శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో శ్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను నివ్వెరపరిచింది. ముఖ్యమంత్రి దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనను విస్మరించకముందే మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకోవడం కలచి వేస్తోంది.