వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి కేసీఆర్! పాదాభివందనం! సెంటిమెంట్లు పక్కన పెట్టేశారు! ఎందుకలా?
తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సుమారు అరగంటకు పైగా ఆయన తన కుటుంబ సభ్యులతో సహా చెవిరెడ్డి నివాసంలో గడిపారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించడానికి కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ఆయన సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుచానూరులో వెలసిన శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
చంద్రబాబు సొంత జిల్లాలో అసమ్మతి సెగ! ఓడిన అభ్యర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?
అధికారిక షెడ్యూల్ ప్రకారం.. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది. తిరుచానూరు నుంచి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తుమ్మలగుంటలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఉదయం 11 గంటల సమయంలో చెవిరెడ్డి నివాసానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. అరగంట పాటు అక్కడే గడిపారు. తరువాత రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్కు స్వాగతం పలకడానికి చెవిరెడ్డి అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలతో చెవిరెడ్డి నివాసం కోలాహలంతో నిండిపోయింది.
చెవిరెడ్డి ఇంటికి వెళ్లే విషయంలో కేసీఆర్.. తన సెంటిమెంట్ను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. సంప్రదాయాలు, కట్టుబాట్లకు కట్టుబడి ఉండే కేసీఆర్..షెడ్యూల్ను సవరించుకుని మరీ.. చెవిరెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా- దైవదర్శనానికి వెళ్లిన భక్తులు ఎవరి ఇళ్లకూ వెళ్లరు. నేరుగా సొంతింటికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల సంభవిస్తాయని భావిస్తోన్న సానుకూల ఫలితాలు తమకే దక్కాలనుకోవడం ఓ కారణం కావచ్చు.
పైగా- సంప్రదాయాలు, కట్టుబాట్లను నిక్కచ్చిగా అనుసరించే నాయకుడు కేసీఆర్. అలాంటిది- తిరుమలలో ఏడుకొండల వాడిని, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్కు చేరుకోవాల్సిన ఆయన చెవిరెడ్డి ఇంటికి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్, చెవిరెడ్డి కుటుంబాల మధ్య బంధుత్వం ఉందని స్థానికులు చెబుతున్నారు.