తిరుమలకు వెళ్తున్నారా? కాస్త జాగ్రత్త: భారీ వర్షాల ధాటికి ప్రమాదకరంగా ఘాట్ రోడ్డు
తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నివర తుఫాన్ సమయంలో ఆరంభమైన ఈ భారీ వర్షాలు అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. నివర్ తుఫాన్ వెంటే.. బురెవి కూడా ముప్పు కూడా ముంచుకుని రావడంతో ఏకధాటిగా వర్షాలకు పడుతున్నాయి.తిరుమల తడిచి ముద్దవుతోంది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడా వీధులు జలమయం అయ్యాయి. కాటేజీల ఆవరణలో వర్షుపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి.
భారీ వర్షాలకు చలి తీవ్రత తోడుకావడంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా పరిణమించాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. సోమవారం ఉదయం రెండో ఘాట్ రోడ్డులో 12వ కిలోమీటర్ సమీపంలో కొండచరియలు విరిగి పడ్డాయి. బండరాళ్లు రోడ్డుకు అడ్డగా పడ్డాయి.
ఈ సమాచారం అందుకున్న వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన బండరాళ్లను తొలగించారు. మినీ జేసీబీని తెప్పించి, బండరాళ్లను తొలగించారు. కొండచరియలు విరిగిపడటంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాటిని తొలగించిన అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఈ సారి తిరుమలలో భారీ వర్షాలు పడటం వల్ల కపిలతీర్థం పొంగిపొర్లుతోంది.
Recommended Video
మాల్వాడి గుండం జలపాతం సరికొత్త అందాలను పుణికిపుచ్చుకుంది. మాల్వాడి గుండం వాటర్ ఫాల్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడు కొండల నుంచి కిందికి దూకుతోంది. తిరుమల కొండ మీదున్న జలాశయాల్లో సమృద్ధిగా నీరు చేరింది. తిరుమతి సమీపంలోని కల్యాణి డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తేశారు అధికారులు. దిగువకు నీటిని వదులుతున్నారు. కల్యాణి రిజర్వాయర్ దిగువ ప్రాంతాలకు ఇదివరకే హెచ్చరికలను జారీ చేశారు.