తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..వారంలో రెండోసారి
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమలకు వెళ్లే దారిలో తరచూ ప్రమాదాలు నమోదవుతున్నాయి. రెండురోజుల కిందట కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డులో కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడుతున్నాయి. శుక్రవారం కూడా కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. తిరుమల రెండో ఘాట్ మలుపులో మట్టి పెళ్లలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కొండ చరియలు విరిగి పడటం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ నెల 14వ తేదీన ఓ పెద్ద బండరాయి విరిగి పడిన ఘటన చోటు చేసుకున్న ఘటన తెలిసిందే.
కొద్దిరోజుల కిందట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. రెండు రోజుల కిందట కూడా తిరుపతి, తిరుమలల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఫలితంగా- కొండ చరియలు తరచూ విరిగి పడుతున్నాయి. కిందటి నెలలో కూడా స్వల్పంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశావత్తూ ఎలాంటి నఫ్టమూ సంభవించలేదు. నిత్యం వాహనాలు రద్దీగా తిరుగాడే మార్గమైనప్పటికీ.. రాళ్లు, మట్టి పెళ్లలు విరిగి పడ్డ సమయంలో వాహనాలు లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. బండరాళ్లు గానీ, మట్టి పెళ్లలు గానీ రోడ్డు మీద పడకుండా ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ఇదివరకే చేపట్టారు.
బండరాళ్లు పడే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రాంతాల్లో వాటికి అడ్డంగా ఫెన్సింగ్ ను అమర్చారు. తిరుపతి-తిరుమల, తిరుమల-తిరుపతి మార్గాల్లో చాలాచోట్ల అలాంటి ఏర్పాటును చేశారు. ఫెన్సింగులు లేని చోట ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో మరోసారి అలాంటి ప్రాంతాలను గుర్తించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను కోరుతున్నారు భక్తులు. తాజాగా రెండో ఘాట్ లో మట్టి పెళ్లలు విరిగి పడటంతో కొద్దిసేపు వాహనాలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వాటిని తొలగించి, వాహనాలకు మార్గం కల్పించారు.