తిరుపతిలో చిరుత భీభత్సం... యువకుడిపై దాడి... తృటిలో తప్పించుకుని...
తిరుపతిలోని జూపార్క్ సమీపంలో గురువారం(అగస్టు 20) తెల్లవారుజామున ఓ చిరుతపలి ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసింది. బైక్ను వెంబడించిన పులి అతనిపై పంజా విసిరింది. అయితే అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. చిరుత దాడిలో అతని కుడికాలి మోకాలికి గాయమై స్వల్ప రక్తస్రావమైంది.
అంతకుముందు,అర్ధరాత్రి జీవకణలోని వీధిలో ఇదే చిరుత హల్చల్ చేసింది. ఆ సమయంలో ఓ కుక్క గట్టిగా మొరగడంతో... ఇంటి బయట నిద్రపోతున్న నాగరాజు అనే వ్యక్తి నిద్ర లేచి చూశాడు. కుక్కను అమాంతం చిరుత నోట కరవడంతో... నాగరాజు భయపడి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆ తర్వాత కుక్కను నోటితో పట్టుకుని చిరుత ఓ గోడ దూకుతుండగా... కుక్క తప్పించుకుపోయింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జూపార్క్ సమీపంలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి చేసింది.చిరుత దాడిపై అటవీ అధికారులకు సమాచారం అందించడంతో... ప్రస్తుతం ఆ ప్రాంతంలో అణువణువు గాలిస్తున్నారు.
Recommended Video
ఈ నెల 4వ తేదీన తిరుమల ఘాట్ రోడ్డులోనూ ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి నుంచి 4కి.మీ దూరంలో ఉన్న రెండో తిరుమల ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.చిరుత దాడి సమయంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుడిని రక్షించే ప్రయత్నం చేయగా... అతనిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. అయితే ఎలాగోలా ఆ వాహనదారుడు,ట్రాఫిక్ కానిస్టేబుల్ పులి బారినుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఆ తర్వాత చిరుత అడవిలోకి పారిపోయింది.