తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందు
తిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిరుమలకు వెళ్ళాల్సిన చోట కొందరు చేసిన పని భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తిరుమల కొండపై మందు, మాంసాహార విందు నిషేధం అని తెలిసినా కొందరు కొండపై పార్టీ చేసుకుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు.
వెంకన్న పుణ్య క్షేత్రంలో పాడు పనులు
తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లి ఆ శ్రీనివాసుని దర్శించుకుని ఆ దేవదేవుడి సన్నిధిలో కష్టాలు, బాధలను మర్చిపోయి ఆధ్యాత్మిక భావనలతో ఉండాలని చాలా మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. అయితే కొంతమంది మాత్రం స్వామి వారి పుణ్య క్షేత్రంలో కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. ఇక తాజాగా తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం, మాంసం తో పార్టీ చేసుకుంటున్న గ్యాంగ్
తిరుమల కొండపైన బాటగంగమ్మ ఆలయం దగ్గరలో కొంతమంది యువకులు మద్యం సేవిస్తూ, మాంసాహారం తీసుకుంటున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. తిరుమల కొండపై మాంసాహారం, మాంద్యం సేవించటం నిషేధం . ఎవరైనా ఆ పని చేస్తే శిక్షార్హులు . ఇక ఈ నేపధ్యంలో చికెన్ బిర్యానీ, మాంసం తింటున్న సమాచారం మేరకు హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసుల వాహనాన్ని గుర్తించిన ఆ యువకులు పరిగెత్తడానికి ప్రయత్నించగా పోలీసులు వెంటపడి పట్టుకున్నారు.
పట్టుకున్న పోలీసులు .. 14 మంది అరెస్ట్
ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య మీడియాకు తెలిపారు. తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్ వద్ద కొంతమంది మద్యం సేవిస్తున్నట్టు తిరుమల వన్టౌన్ పోలీసులకు సమాచారం అందిందని వెంటనే తమ సిబ్బంది ఆకస్మికంగా దాడిచేసి తిరుమల, తిరుపతికి చెందిన 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు మద్యం సీసాలను,మాంసాహార వంటకాలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు.
ఎక్సైజ్ యాక్ట్తో పాటు తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసులు
తిరుమలలో మద్యం సేవించడం నిషిద్ధం కావడంతో వారిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. మద్యం బాటిళ్లు, మాంసం తిరుమలకు ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వీరికి సహకరించిన వారు ఎవరు ఉన్నా ఉపేక్షించబోమన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న అదనపు ఎస్పీ మునిరామయ్య 14 మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్తో పాటు తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు .