తిరుపతి రైల్వేస్టేషన్ లో మసాజ్ సెంటర్..రేటు కాస్త భారీగానే
తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్ క్రమంగా ఆధునికతను సంతరించుకుంటోంది. ఒకే చోట, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు లభించేలా ఈ స్టేషన్ ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి రైళ్ల ద్వారా తిరుపతికి చేరుకునే భక్తుల కోసం రైల్వే స్టేషన్ లో అనేక సదుపాయాలను కల్పించడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే- ఇక్కడ అత్యాధునికమై వెయిటింగ్ రూమ్ ను నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ వెయిటింగ్ రూమ్ నిర్మితమైంది. విమానాశ్రయాల్లో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రయాణికుల లాంజ్ తరహాలో, ఫైవ్ స్టార్ హోటళ్లలో లభించే సౌకర్యాలతో ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్ ను నిర్మించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
ఈ నెల 21వ తేదీ నుంచి ఈ వెయిటింగ్ రూమ్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అదొక్కటే కాదు- తాజాగా.. మసాజ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్లడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల బడలికను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ మసాజ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దీనికోసం వారు క్లౌడ్ రెస్ట్ మసాజ్ అండ్ మూవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సెంటర్ లో రెండు మసాజ్ మిషన్ లు ఉంటాయి.
విద్యుత్ తో అవి పని చేస్తాయి. రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. దీని వినియోగానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందనే ఇంకా ఖరారు కాలేదు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఈ తరహా సౌకర్యం కాచిగూడ రైల్వేస్టేషన్లో మాత్రమే అందుబాటులో ఉంది.
కాచిగూడ రైల్వేస్టేషన్లో మసాజ్ సెంటర్ ను వినియోగించుకునే ప్రయాణికుల నుంచి ప్రస్తుతం అయిదు నిమిషాలకు 40 రూపాయలు, 10 నిమిషాలకు 80 రూపాయలు, 15 నిమిషాలకు 120 రూపాయల ఛార్జీని వసూలు చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో కూడా దాదాపు ఇదే తరహాలో ఛార్జీలను నిర్ధారించవచ్చని అధికారులు చెబుతున్నారు.